మెట్రో పిల్లర్ కూలింది: ఆ ప్రచారం అవాస్తవం, తేల్చిన పోలీసులు
బెంగుళూరు: మెట్రో పిల్లర్ కూలిపోయిందంటూ వదంతులు వ్యాపించడంతో బెంగళూరు వాసులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. నగరంలోని మైసూర్ రోడ్డులో ఓ పిల్లర్ కూలిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ ప్రచారం కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
అయితే ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారమైంది.అసలు ఎక్కడ కూడ మెట్రో పిల్లర్ కూలిపోలేదని పోలీసులు నిర్ధారించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా అవాస్తమని పోలీసులు తేల్చి చెప్పేశారు. ఈ ప్రచారాన్ని పోలీసులు కొట్టిపారేశారు.
నగర శివారులోని నయందహళ్లిలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లరును ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో పిల్లర్ కొంత మేర దెబ్బతింది. ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. అయితే వాస్తవాన్ని తెలుసుకోకుండానే కొందరు సోషల్ మీడియాలో విపరీత ప్రచారం చేశారు.
పిల్లర్ కూలిపోయిందని పోస్టులు పెట్టారు. దీంతో క్షణాల్లోనే ఈ వార్త నగరమంతా పాకిపోయింది. దీంతో స్పందించిన పోలీసులు, మెట్రో అధికారులు అవి వదంతులు మాత్రమేనని, నమ్మవద్దని కోరారు.