రాత్రి 12 గంటలకు మరో బులెటిన్: ఆస్పత్రికి చేరుకున్న బాలు ఫ్యామిలీ మెంబర్స్..
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి బులెటిన్ విడుదల చేయడంతో ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ సోకిన బాలుకు.. ఇటీవలే నెగిటివ్ కూడా వచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాలని నాన్న కోరుకుంటున్నారని కుమారుడు ఎస్పీబీ చరణ్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇంతలోనే ఆయన ఆరోగ్యం క్షీణించడం కలవరానికి గురిచేస్తోంది.
మెడికల్ బులెటిన్ తర్వాత చెన్నైలో గల ఆస్పత్రికి ప్రముక నటుడు కమలహాసన్ చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్పై చికిత్స అందుతోందని తెలిపారు. మరోవైపు ఆస్పత్రికి ఎస్పీబీ చరణ్ సహా కుటుంబసభ్యులు చేరుకున్నారు. ఆస్పత్రి వద్దకు ఒక్కొక్కరు రావడంతో కాస్త ఉత్కంఠ పరిస్థితి నెలకొంది.
Recommended Video
బాల సుబ్రహ్మణ్యంకు కరోనా నెగిటివ్ వచ్చిన.. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ మాత్రం తగ్గలేదు. దీంతో వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నారు. బుధవారం జ్వరం రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈ క్రమంలో అర్ధరాత్రి 12 గంటలకు ఎంజీఎం ఆస్పత్రి యజమాన్యం మరో బులెటిన్ విడుదల చేస్తామని ప్రకటించింది. దీంతో బాలు ఆరోగ్యం గురించి ఏం చెబుతారోనని ఆందోళన సర్వత్రా నెలకొంది. బాలు కోలుకోవాలని శత కోటి దేవుళ్లను అభిమానులు ఇంకా కోరుకుంటూనే ఉన్నారు.