మహిళలపై అఘాయిత్యాలు- జీరో ఎఫ్ఐఆర్ అమలు-అధికారులపైనా చర్యలకు కేంద్రం సూచన
దేశవ్యాప్తంగా మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు, లైంగిక దాడులు, దౌర్జన్యాల నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, తప్పు చేస్తే శిక్ష తప్పదన్న సంకేతాలు ఇవ్వాలని సూచనలు చేసింది. ఈ విషయంలో అధికారుల అలసత్వం ఉందని తేలితే వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరింది.
మహిళలపై లైంగిక దాడి లేదా అత్యాచారం జరిగిందని తెలిస్తే రెండు నెలల్లోపు ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించి జాతీయ డేటాబేస్లో అప్డేట్ చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. తరచుగా నేరాలకు పాల్పడుతున్న వారి డేటాను కూడా ప్రత్యేకంగా సేకరించాలని తెలిపింది. మహిళలపై అఘాయిత్యం జరిగినప్పుడు స్ధానిక పోలీసు స్టేషన్ పరిధిలోకి రానప్పుడు జీరో ఎఫ్ఐఆర్ దాఖలుకు అవకాశం కల్పించాలని తాజా ఆదేశాల్లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఆ తర్వాత సంబంధిత పీఎస్కు ఎఫ్ఐఆర్ పంపాలని సూచించింది.
Recommended Video
మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు వాటిని గుర్తించి చర్యలు తీసుకునేలా చట్టాల్లో కఠినమైన నిబంధనలు ఉన్నాయని, వాటి అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపైనా చర్యలు తీసుకోవాల్సిందే అని కేంద్రం తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఉత్తర్ప్రదేశ్లోని హత్రాస్లో యువతిపై అత్యాచారం, హత్య విషయంలో యూపీ సర్కారు ఎదుర్కొంటున్న విమర్శల నేపథ్యంలో కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. హత్రాస్ దారుణంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండటం, యూపీ పోలీసుల పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.