ఓసీఐ కార్డు ఉంటే ఇండియాకు రావొచ్చు: కానీ, షరతులు వర్తిస్తాయి
న్యూఢిల్లీ: ఇప్పటికే వందేభారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కకున్న భారతీయులను స్వదేశం తీసుకొస్తున్న కేంద్రం.. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డు కలిగి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు తీపి కబురు అందించింది. భారత్ వచ్చేందుకు వీరికి అనుమతిచ్చింది.
షాకింగ్: క్యాబ్ డ్రైవర్పై ఉమ్మేసిన కరోనా బాధితుడు, నెల రోజులకే మృతి, ఏం జరిగిందంటే?
అయితే, కొన్ని నిబంధనలను విధిస్తూ కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల్లో ఉన్న భారతీయులకు జన్మించి, ఓసీఐ కార్డు కలిగినవారిని భారత్కు వచ్చేందుకు అనుమతిస్తారు. కుటుంబసభ్యుల్లో ఎవరైనా మరణించడం వంటి అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు భారత్ రావాలనుకునే ఓసీఐ కార్డుదారులు రావొచ్చు.
అంతేగాక, భారత్లో శాశ్వత నివాసం కలిగి ఉన్న భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరికి ఓసీఐ కార్డు ఉంటే వారికి భారత్ కు వచ్చేందుకు అనుమతి ఉంది. విదేశీ యూనివర్సిటీల్లో చదువుకుంటూ ఓసీఐ కార్డు ఉన్న విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు అనుమతిస్తారు. అయితే, వారి తల్లిదండ్రులు భారత పౌరులై, భారతదేశంలో నివసిస్తున్నవారై ఉండాలి. వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ కొనసాగుతోంది.