10, 12 పరీక్షలు నిర్వహించుకోండి, కానీ..: కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆయా పరీక్షలను నిర్వహించుకునేందుకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తున్నట్లు వెల్లడించారు.
సీబీఎస్ఈ 10 పరీక్షలు జులై 1 నుంచి, 12 పరీక్ష జులై 9, షెడ్యూల్ ఇదే
ఈ మేరకు కొన్ని నిబంధనలతో కూడిన సడలింపులను ఇస్తున్నట్లు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చామని మంత్రి తెలిపారు. విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించిన సడలింపులతో హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్రాలు, సీబీఎస్ఈ నుంచి వచ్చిన వినతులపై సమీక్ష అనంతరం ఈ మేరకు ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు.
లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే పరీక్షలు నిర్వహించుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. విద్యార్థులను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్, పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయడం తప్పనిసరి అని తెలిపారు.
Taking into consideration the academic interest of large number of students, it has been decided to grant exemption from the lockdown measures to conduct Board examination for classes 10th & 12th, with few conditions like social distancing, face mask etc, for their safety. pic.twitter.com/P4ULsmbPVv
— Amit Shah (@AmitShah) May 20, 2020