పద్మ అవార్డుల దరఖాస్తు గడువు పెంపు- కేంద్ర హోంశాఖ తాజా నిర్ణయం..
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్ధితి. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో కేంద్రం కూడా ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ తేదీని పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఇవాళ నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండగా.. దాన్ని సెప్టెంబర్ 15 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నెల 15 వరకూ ప్రతిపాదనలు స్వీకరించనున్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా పద్మ అవార్డులను కేంద్ర హోంశాఖ వర్గాలు ఖరారు చేస్తాయి.
Recommended Video
వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన వారికి ఏటా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు అందజేస్తుంది. ఇందులో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ కేటగిరీల్లో అవార్డులు అందజేస్తారు. వీటి కోసం ఏటా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తారు. ఇప్పటివరకూ ప్రభుత్వాల నుంచి 8,035 దరఖాస్తులు రాగా.. 6,361 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది. ఏటా గణతంత్ర దినోత్సవం రోజున ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.