సీఏఏ అమలు మరింత ఆలస్యం-జనవరి 9వరకూ గడువు కోరిన కేంద్ర హోంశాఖ
2019లో పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో తాజాగా సీఏఏ కొత్త రూల్స్ రూపొందించేందుకు మరింత గడువు కావాలని హోంశాఖ కేంద్రాన్ని కోరింది. దీంతో సీఏఏ అమలు మరింత ఆలస్యం కానుంది.
పార్లమెంటులో 2019లో ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం ఇప్పటికీ దేశంలో అమలుకు నోచు కోలేదు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేవలం అసోంలో మాత్రమే అమలు చేశారు. మిగతా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు నిబంధనలు మార్చాలని నిర్ణయించిన నేపథ్యంలో కొత్త నిబంధనలు రూపొందించేందుకు వచ్చే ఏడాది జనవరి 9 వరకూ గడువివ్వాలని హోంశాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు ఇవాళ పార్లమెంటుకు సమాచారం ఇచ్చారు.
2019 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదం పొంది 2020 జనవరిలో అమల్లోకి వచ్చిన సీఏఏ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు నిబంధనల మార్పు కోసం పార్లమెంటు సబార్డినేట్ లెజిస్టేషన్స్ కమిటీ, లోక్ సభ, రాజ్యసభ కూడా వచ్చే ఏడాది జనవరి 9వరకూ గడువు కోరినట్లు నిత్యానందరాయ్ పార్లమెంటుకు తెలిపారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన మైనారిటీలకు భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ చట్టం రెండేళ్లుగా అమలు కాలేదు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినా నిబంధనల రూపకల్పన మాత్రం ఇంకా జరగలేదు. దీంతో కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.