మూడేళ్లుగా చైనా, భూటాన్ సరిహద్దుల్లో చొరబాట్లు లేవన్న కేంద్రం-పార్లమెంటులో క్లారిటీ
చైనా, భూటాన్ సరిహద్దుల్లో గత ఏడాదిలో పలుమార్లు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఇవాళ పార్లమెంటులో కీలక ప్రకటన చేసింది. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో గత మూడేళ్లలో అస్సలు చొరబాట్లే జరగలేదని స్పష్టత ఇచ్చింది. దీంతో గతేడాదిగా చైనా సరిహద్దుల్లో చొరబాట్లపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది.
గత మూడేళ్లలో భారత్ తో ఉన్న చైనా, భూటాన్ సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లు జరగలేదని హోంశాఖ సహాయమంత్రి నితీశ్ ప్రమాణిక్ ఇవాళ లోక్ సభలో వెల్లడించారు. లోక్ జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. గత మూడేళ్లలో అంతర్జాతీయ సరిహద్దుల్లో పలు చొరబాట్లు జరిగినట్లు వార్తలు వచ్చాయని, దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. దీనికి హోంశాఖ సహాయమంత్రి నితీశ్ ప్రమాణిక్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో చొరబాట్లపై క్లారిటీ ఇచ్చారు.
ఇందులో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో 128 చొరబాట్లు జరిగినట్లు మంత్రి ప్రమాణిక్ తెలిపారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 1787 చొరబాట్లు జరిగినట్లు గుర్తించామన్నారు. అలాగే నేపాల్ సరిహద్దుల్లో 25 చొరబాట్లు జరిగాయన్నారు. మయన్నార్ సరిహద్దుల్లో 133 చొరబాట్లు జరిగినట్లు మంత్రి తెలిపారు. కానీ చైనా, భూటాన్ సరిహద్దుల్లో మాత్రం ఎలాంటి చొరబాట్లు చోటు చేసుకోలేదని ఆయన వెల్లడించారు. ఆయా కేసుల్లో సరిహద్దు భద్రతా బలగాలు, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో సరిహద్దు చెక్ పోస్టుల్ని పటిష్టం చేయడం, నిఘా పెంపుతో పాటు ఇతర చర్యలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా ఆర్మీ బలగాలు 100 అశ్వ దళాలతో చొరబడి రెక్కీ నిర్వహించి వెళ్లాయని వార్తలొచ్చాయి. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్రం మాత్రం చైనా సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లు జరగలేదని ప్రకటించడం విశేషం. చైనా సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్తతలు కూడా కొనసాగుతున్నాయి. పలుమార్లు మిలటరీ స్దాయి చర్చలు జరిగినా ఇంకా ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు.