నడ్డా కాన్వాయ్ దాడిపై కేంద్రం సీరియస్- ఢిల్లీ రావాలని బెంగాల్ సీఎస్, డీజీపీకి సమన్లు
కోల్కతాలోని డైమండ్ హార్బర్ సమీపంలో నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై టీఎంసీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న కొందరు దాడి చేయడంపై కేంద్రం సీరియస్ అయింది. నిన్నటి ఘటనపై గవర్నర్, అధికారులు రెండు వేర్వేరు నివేదికలు ఇవ్వాలని కేంద్ర అమిత్షా కోరారు.
అదే సమయంలో బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ, హోంశాఖ కార్యదర్శికీ కేంద్ర హోంశాఖ సమన్లు పంపింది. బెంగాల్లో శాంతి భద్రతల పరిస్ధితిపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సీఎస్, డీజీపీ, హోంశాఖ కార్యదర్శికీ పంపిన సమన్లలో పేర్కొంది. ఈ నెల 14న ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సదరు అధికారులకు కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో మరింత కలకలం రేపుతోంది. ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మధ్య ముఖాముఖీ పోరు సాగుతున్న తరుణంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలపైనా ఇరుపార్టీల మధ్య మాటలయుద్దం సాగుతోంది.
Recommended Video
మరోవైపు బెంగాల్లో నడ్డా దాడిని సీరియస్గా తీసుకున్న హోంమంత్రి అమిత్షా ఈ నెల 19న బెంగాల్లో పర్యటించాలని నిర్ణయించారు. మూడు చోట్ల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 19, 20 తేదీల్లో అమిత్షా బెంగాల్లో పర్యటించబోతున్నారు. నడ్డా కాన్వాయ్ దాడిపై బీజేపీ, టీఎంసీ మధ్య తీవ్ర మాటలయుద్దం సాగుతున్న తరుణంలో అమిత్షా బెంగాల్ టూర్ మరో సంచలనం రేపుతోంది. నడ్డా కాన్వాయ్ దాడిని ఇప్పటికే క్షేత్రస్ధాయిలో రాజకీయం చేయాలని భావిస్తున్న బీజేపీ.. అమిత్షా టూర్తో ఈ వివాదాన్ని మైలేజ్ కోసం వాడుకోబోతున్నట్లు తెలుస్తోంది.