వైమానిక దళ హెలికాప్టర్ కు తప్పిన ముప్పు: ఎమర్జెన్సీ ల్యాండింగ్
బెంగళూరు: మన దేశ వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ కు ముప్పు తప్పింది. సాంకేతిక లోపాలు తలెత్తిన విషయాన్ని గమనించిన వెంటనే పైలెట్ ఆ హెలికాప్టర్ ను అత్యవసరంగా కిందికి దించారు. ఫలితంగా- ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కర్ణాటకలోని మండ్య జిల్లాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు గురైన హెలికాప్టర్ ను మిల్ మి-17 రకానికి చెందినదిగా వైమానిక దళ అధికారులు నిర్ధారించారు.
ఇమ్రాన్ఖాన్కు తప్పిన ముప్పు... న్యూయార్క్లో ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
కర్ణాటకలోని మైసూరులో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల కోసం ఈ హెలికాప్టర్ ను ప్రత్యేకంగా కేటాయించారు వైమానిక దళ అధికారులు. దసరా వేడుకలను తిలకించడానికి జాతీయ స్థాయి ప్రముఖులను మైసూరుకు తరలించడానికి ఈ హెలికాప్టర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దసరా ఉత్సవాలు ముగిసేంత వరకూ ఈ హెలికాప్టర్ మైసూరులోనే ఉండేాలా దీని షెడ్యూల్ ను రూపొందించారు.
విధి నిర్వహణలో భాగంగా మైసూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న సమయంలో మిల్ మి-17 హెలికాప్టర్ లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీన్ని గమనించిన వెంటనే పైలెట్ అప్రమత్తం అయ్యారు. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ సమీపంలోని అత్యవసరంగా హెలికాప్టర్ ను కిందికి దించారు. హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ కు గురి కాలేదని వాయుసేన అధికారులు ధృవీకరించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సందర్భంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని రక్షణ మంత్రిత్వ శాఖ పౌర సంబంధాల అధికారి పేరు మీద ఓ ప్రకటన వెలువడింది.
కొద్దిరోజులుగా మన దేశ సైన్యానికి చెందిన హెలికాప్టర్లు వరుసగా కుప్పకూలిపోతున్నాయి. ఇటీవలే మధ్య ప్రదేశ్ లో మిగ్ హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పైలెట్లు సురక్షితంగా బయట పడగలిగారు. ఆ తరువాత భూటాన్ లో భారత సైన్యానికి చెందిన చేతక్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మనదేశ సైన్యానికి చెందిన పైలెట్, రాయల్ భూటాన్ ఆర్మీ అధికారి ఒకరు దుర్మరణం పాలయ్యారు. తాజాగా మండ్యలో వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ కావడం కలకలం రేపుతోంది.