క్యాస్ట్రో మృతి: చావు కోసం ఎదురు చూస్తున్నామని మియామి సంబరాలు
పిడెల్ క్యాస్ట్రో మృతి తర్వాత మియామీ వీధుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఓ దుర్మార్గుడు పోయాడని, క్యూబాకు స్వాతంత్ర్యం వచ్చినట్లయిందని మియామీలో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మియామి: పిడెల్ క్యాస్ట్రో మృతి తర్వాత మియామీ వీధుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఓ దుర్మార్గుడు పోయాడని, క్యూబాకు స్వాతంత్ర్యం వచ్చినట్లయిందని మియామీలో ప్రజలు వీధుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్యూబా విప్లవ నేత క్యాస్ట్రో మృతి చెందిన విషయం తెలిసిందే.
గతంలో క్యూబా నుంచి వలస వచ్చి అమెరికన్లుగా మారిపోయి నివసిస్తున్న వందలాది మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. హవానా కమ్యూనిస్టుల పాలన సమయంలో వలస వచ్చి స్థిరపడిన వీరంతా, కార్లలో వీధుల్లోకి వచ్చి, డ్రమ్స్ వాయిస్తూ, నృత్యాలు చేస్తూ, నినాదాలు చేస్తూ, క్యూబా జెండాలను ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నారు.
అమెరికాలో క్యూబన్ - అమెరికన్లు అత్యధికంగా ఉండే ప్రాంతం మియామీ. క్యాస్ట్రో మృతి పట్ల వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు యువతీ యువకులు సామాజిక మాధ్యమాల్లో క్యాస్ట్రో మృతి తమకు ఆనందకరమని పోస్టులు పెట్టారు.
చాలామంది జెండాలు ఎగురవేసి, బాణసంచా కాల్చారు. క్యాస్ట్రో మృతి కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని ప్లకార్డులు ప్రదర్శించారు. లిటిల్ హవానా ప్రాంతంలో డ్రమ్స్ వాయిస్తూ నృత్య ప్రదర్శనలు కూడా నిర్వహించారు.
క్యాస్ట్రో మరణించారని అవాస్తవ ప్రచారాలు జరిగిన ప్రతిసారీ ఇక్కడ వేడుకలు నిర్వహించేవారు. ప్రస్తుతం పది లక్షల మందికిపైగా క్యూబా-అమెరికన్లు రోజులపాటు సంబరాలు జరుపుకొంటారని మయామీ మేయర్ థామస్ రెగాలాడో వివరించారు.