ధరలు..ద్రవ్యోల్బణం..సంక్షోభం: ఆర్బీఐకి కొత్తగా డిప్యూటీ గవర్నర్: ఆరునెలల తరువాత భర్తీ..!
న్యూఢిల్లీ: ఆకాశాన్నంటుతున్న ధరలు.. దానితో పోటీ పడుతోన్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే కనిపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భారతీయ రిజర్వుబ్యాంకు (ఆర్బీఐ)నకు కొత్తగా డిప్యూటీ గవర్నర్ను నియమించింది. ఆయనే- మైఖెల్ దేబబ్రత పాత్ర. ఆర్థిక రంగ నిపుణుడిగా పేరుంది. దేశ ఆర్థికరంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మధ్య బాధ్యతలను స్వీకరించబోతున్న ఆయనపై అనేక అంచనాలు ఏర్పడ్డాయి కూడా.
ఆరునెలల తరువాత భర్తీ..
దేబబ్రత పాత్రను రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ మేరకు నియామకాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసులను కేంద్రం ఆమోదించింది. రిజర్వుబ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య స్థానాన్ని దేబబ్రత పాత్ర భర్తీ చేస్తారు. డిప్యూటీ గవర్నర్గా విరల్ ఆచార్య గత ఏడాది జులై 23వ తేదీన పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచీ ఈ స్థానం ఖాళీగా ఉంటోంది.
ఇదివరకు ఈడీగా..
దేబబ్రత పాత్రకు రిజర్వుబ్యాంకులో పని చేసిన అనుభవం ఉంది. ఇదివరకు ఆయన రిజర్వుబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్, స్టాటిస్టిక్స్, పాలసీ రీసెర్చ్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్, న్యూ ఫ్రాంటియర్స్ యూనిట్.. వంటి కొన్ని కీలక విభాగాలకు ఆయన తన సేవలను అందించారు. వస్తు, సేవల పన్ను చట్టానికి సంబంధించి డ్రాఫ్ట్ రూపకల్పనకు తన వంతు కృషి చేశారు.
ఐఐటీ- బోంబే నుంచి పీహెచ్డీ
దేబబ్రత పాత్ర ఉన్నత విద్యావంతుడు. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ-బోంబే నుంచి ఎకనమిక్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు. సెంట్రల్ బ్యాంకర్గా ఆయన తన కేరీర్ను ఆరంభించారు. దేశంలో ఇప్పుడు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో మైఖెల్ దేబబ్రత పాత్రను డిప్యూటీ గవర్నర్గా నియమించడాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా భావిస్తున్నారు ఆర్థికరంగ నిపుణులు. ఆర్థికరంగంలో పలు అంశాలపై ఆయనకు మంచి పట్టు ఉందని అభిప్రాయపడుతున్నారు.