పైలట్ టెన్షన్: విమానానికి దగ్గరగా 4పారాచూట్లు
ముంబై: విమానం 6వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా దాని సమీపంలోకి నాలుగు పారాచూట్లు వచ్చాయి. దీంతో పైలట్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఈ ప్రమాదకర పరిస్థితి శుక్రవారం ఉదయం ఎయిర్ ఇండియా విమానం మహారాష్ట్రలోని వసాయ్ నుంచి తమిళనాడులోని చెన్నైకి వెళ్తుండగా తలెత్తింది.
ఎయిర్బస్ 319 ఆరువేల అడుగుల ఎత్తులో వెళ్తున్న సమయంలో విమానానికి సమీపంలో నాలుగు పారాచూట్లు గుర్తించినట్లు విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటిసి) అధికారులకు తెలిపారు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగు పారాచూట్లు కనిపించాయని పైలట్ తెలిపినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారి పేర్కొన్నారు.
అయితే ఆ పారాచూట్ల వివరాలు వెల్లడించలేదు. కొద్ది రోజుల క్రితం కూడా ఇక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు గుర్తించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏవియేషన్(డిజిసిఏ) ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింంది. ప్రాథమిక విచారణ విచారణ ప్రారంభించినట్లు తెలిపింది.
కాగా, గత పదిహేను రోజుల్లో ఇలాంటి ఘటనలు వరసగా మూడు జరిగాయి. బుధవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపైన పెద్ద బెలూన్ ఎగురుతూ కనిపించింది. బెలూన్ కనిపించడంపై అధికారులకు ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తయ్యారు.
ఆ తర్వాత అది వాతావరణ శాఖకు చెందినదని స్పష్టంచేశారు. జనవరి 26న రాజస్థాన్లోని పాక్ సరిహద్దు ప్రాంతంలో కనిపించిన అమెరికా తయారీ హీలియం బెలూన్ను సుఖోయ్-30 యుద్ధ విమానం పేల్చేసింది.
25వేల అడుగుల ఎత్తులో జైసల్మేర్ మీద ఎగురుతుండగా ఎయిర్ ఫోర్స్ రాడార్స్ దాన్ని గుర్తించాయి. ‘హ్యాపీ బర్త్డే' అని రాసి ఉన్న ఆ బెలూన్ ఇండియా ఎంత త్వరగా స్పందిస్తుందో చూసేందుకు పాకిస్థాన్ నుంచి వదిలి వుంటారని భావిస్తున్నట్లు తెలిసింది.