శబరిమలలో అర్ధరాత్రి టెన్షన్.. పోలీసుల ఆంక్షలపై భక్తుల నిరసన
శబరిమల : కేరళలోని శబరిమల టెంపుల్ పరిసరాల్లో పోలీసుల ఆంక్షలపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈనేపథ్యంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి భక్తులు మరోసారి నిరసనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసనకు దిగారు. కేరళ సీఎం పినరయి విజయన్ ఇంటి ఎదుట కూడా ఆందోళన చేపట్టారు.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్నీ వయసుల మహిళల ప్రవేశానికి పర్మిషన్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆందోళనలు రేకేత్తాయి. అక్టోబర్ నెలలో టెంపుల్ ను తెరవగా టెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా మండల పూజల కోసం మరోసారి ఆలయాన్ని తెరిచారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆంక్షలు విధించడంతో భక్తులు మండిపడుతున్నారు.
పోలీసుల ఆంక్షలు.. భక్తుల నిరసనలు
గత అనుభవాల దృష్ట్యా శబరిమల ఆలయంలో పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు. అంతేగాకుండా కొన్ని ఆంక్షలు విధించారు. సన్నిధానంలో 144 సెక్షన్ విధించడంతో పాటు టెంపుల్ పరిసరాల్లో రాత్రి పూట భక్తులు ఎవరూ ఉండకూడదనే నిబంధనలు విధించారు. అయితే పోలీసుల ఆంక్షలను భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆలయ ప్రాంగణంలో నిరసనకు దిగారు. దీంతో దాదాపు 70 మంది ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ఆంక్షలపై భగ్గుమన్న బీజేపీ, ఆరెస్సెస్
పోలీసుల చర్యలపై బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ఆలయంలో ఆంక్షలేంటని ప్రశ్నించారు. అంతేకాదు పోలీసులు అనుసరిస్తున్న విధానాలు సరికావంటూ ఆటవిక చర్యగా అభివర్ణించారు. శబరిమల టెంపుల్ లో ఆంక్షలు ఎత్తివేయాలని, పోలీస్ బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసనకు దిగారు. కేరళ సీఎం పినరయి విజయన్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు.
15వేల మంది పోలీసులా? ఇంత దారుణమా : కేంద్రమత్రి ఆల్ఫోన్స్
శబరిమలలో తాజా పరిస్థితులు ఎమర్జెన్సీ కంటే దారుణంగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి ఆల్ఫోన్స్. 144 సెక్షన్ విధించాల్సిన అవసరమేముందంటూ ప్రశ్నించారు. అయ్యప్ప భక్తులను ఇబ్బందులకు గురిచేయడం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు. 15వేల మంది పోలీసులను నియమించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులేమైనా ఉగ్రవాదులా అంటూ ప్రశ్నించిన మంత్రి.. పోలీసుల ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు.