సాహో ‘బహదూర్’.. మిగ్-27 యుద్ధవిమానాలకు అల్విదా.. పాక్కు వీటిని చూస్తేనే గడగడ
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)లో అత్యంత శక్తిమంతమైనవిగా పేరుపొందిన మిగ్-27 శ్రేణి యుద్ధవిమానాలు శాశ్వతంగా విధుల నుంచి తప్పుకున్నాయి. ఈ యుద్ధవిమానం శుక్రవారంనాడు తన ఆఖరి ప్రయాణాన్ని ముగించుకుని ల్యాండైన సందర్భంలో.. యావత్ దేశం.. మరీ ముఖ్యంగా ఐఏఎఫ్ ఉద్విగ్నతకులోనైంది. 1985లో మన వాయుసేనలో చేరిన మిగ్.. తనవైన సాహసాలతో శత్రువుకు చుక్కలుచూపించింది.. మరెన్నో బిరుదులూ పొందింది.
సుదీర్ఘకాలం సేవలు
ఒకటీ రెండూ కాదు.. 34 ఏండ్లపాటు సాగిన అప్రతిహత ప్రయాణం మిగ్ యుద్ధవిమానానిది. ఒక మనిషి జీవితంలోనైనా.. మెషిన్ లైఫ్లోనైనా ఇది చాలా పెద్ద టైమ్. చెప్పుకోడానికి, రాసుకోడానికి బోలెడు చరిత్ర. ఒక్కసారి మిగ్ను ఒక మనిషితో పోల్చుకుంటే.. వాయుసేనలో 34 ఏండ్ల సుదీర్ఘ సేవలందించిన ఆ మనిషి.. హై ర్యాంక్ ఆఫీసర్గా కించిత్ గర్వంతో రిటైర్మెంట్ తీసుకున్నట్లన్నమాట.
ఘనంగా వీడ్కోలు
రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిర్బేస్ లో శుక్రవారం ఉదయం చివరిసారిగా ల్యాండైన మిగ్-27కు ఘనమైనరీతిలో వీడ్కోలు లభించింది. వాటర్ సెల్యూట్ తో దాన్ని ఐఏఎఫ్ సిబ్బంది గౌరవించుకున్నారు. ఈ వేడుక తర్వాత.. దేశంలో ప్రస్తుతం ఉన్న మిగ్27 విమానాలేవీ గాల్లోకి ఎగరవు. స్క్వాడ్రన్ స్కార్పియన్ 29 రకానికి చెందిన మిగ్27 యుద్ధ విమానాల్ని డీకమిషన్ చేస్తున్నట్లు ఐఏఎఫ్ ప్రకటించింది.
సాహో ‘బహదూర్‘
స్కార్పియన్ 29 శ్రేణిలో అప్గ్రేడ్ చేసిన మిగ్ 27 విమానాల్లో ఇవాళ వీడ్కోలు పొందింది చిట్టచివరి యుద్ధవిమానం. వెస్ట్ బెంగాల్ లోని హషిమారా ఎయిర్ బేస్ లో ఇటీవలే మరో రెండు మిగ్ 27లను డ్యూటీల నుంచి పక్కకు తప్పించారు. 1999 కార్గిల్ వార్ సమయంలో మిగ్27 ఫైటర్లు అద్భుతరీతిలో పెర్ఫామ్ చేశాయి. అత్యంత సాహసోపేతంగా పాకిస్తాన్ శిబిరాలపైకి దూసుకెళ్లి.. అక్కడి శత్రుమూకలపై బాంబుల వర్షం కురిపించింది. అందుకే మిగ్ 27ను ‘బహదూర్‘ అని వైమానికదళం గౌరవంగా పిలుచుకుంటుంది. 2001-02లో పాక్ తోక కత్తిరించిన ‘ఆపరేషన్ పరాక్రం'లోనూ మిగ్27 విమానాలది అద్వితీయపాత్ర.
డీకమిషన్ తర్వాత వీటిని ఏంచేస్తారు?
రతవైమానికదళం చరిత్రలో మిగ్27 అధ్యాయం ముగిసింది. డీకమిషన్ తర్వాత ఇప్పుడున్న ఏడు ఎయిర్ క్రాఫ్ట్ లను ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వాటిని ధ్వంసం చేసి తుక్కుగా మార్చేస్తారా? డిఫెన్స్ మ్యూజియమ్ కు తరలిస్తారా? అనేదానిపై ఇప్పుడే సమాధానం చెప్పలేమని రక్షణశాఖ అధికార ప్రతినిధి సంబిత్ ఘోష్ అన్నారు. వీటిని ఇతర దేశాలకు అమ్మే అవకాశాలూ లేకపోలేవని ఘోష్ చెప్పారు.