పక్షి ఢీ: కూలిన మిగ్-29 యుద్ధ విమానం: ఇద్దరు పైలెట్లు సేఫ్
పనాజీ: గోవాలో నేవీకి చెందిన మిగ్-29కే శిక్షణ ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. వారిని రక్షించడానికి సహాయ చర్యలు చేపట్టినట్లు నేవీ అధికారులు వెల్లడించారు.
ట్రైనింగ్ సెషన్లో భాగంగా టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. దీనిపై నేవీ అధికార ప్రతినిధి వివేక్ మధ్వాల్ మాట్లాడుతూ.. 'మిగ్-29కే' ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ లో మంటలు చెలరేగం వల్లే ప్రమాదం జరిగింది.
అందులో ఉన్న పైలెట్లు కెప్టెన్ ఎం షియోకానంద్, లెఫ్టినెంట్ కమాండర్ దీపక్ యాదవ్ సురక్షితంగా తప్పించుకున్నారు. ప్రమాద స్థలి నుంచి వారిని రప్పించడానికి సిబ్బందిని పంపామని తెలిపారు.
ఓ పక్షి బలంగా ఢీనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, సురక్షిత ప్రాంతంలోనే విమానం కూలడంతో తమకు ఎలాంటి గాయాలు కాలేదని పైలట్లు చెప్పుకొచ్చారు. కాగా, గత అక్టోబర్ 24న ఆర్మీ కమాండర్ లెఫ్ట్నెట్ జనరల్ రణబీర్ సింగ్ కూడా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.