అరేబియా సముద్రంలో కుప్పకూలిన్ మిగ్: ఆ పైలెట్ ఏమయ్యాడు?: విస్తృతంగా గాలించినా
ముంబై: భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్.. అరేబియా సముద్రంలో కుప్పకూలిపోయింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక పైలెట్ ప్రాణాలతో బయటపడ్డారు. మరొకరు గల్లంతు అయ్యారు. గల్లంతైన పైలెట్ కోసం నిరంతరాయంగా గాలిస్తున్నప్పటికీ.. ఫలితం కనిపించట్లేదు. సంఘటన చోటు చేసుకున్నప్పటి నుంచీ రెండో పైలెట్ కోసం విస్తృతంగా గాలించారు. రాత్రివేళ కూడా రెస్క్యూ చర్యలు కొనసాగించారు. అయినప్పటికీ.. రెండో పైలెట్ జాడ కనిపించలేదు.
Recommended Video
మిగ్-29కే అరేబియా సముద్రంలో కుప్పకూలిన విషయాన్ని భారత నౌకాదళాధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. మిగ్-29కే ట్రైనీ ఎయిర్క్రాఫ్ట్ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తోన్న సమయంలో ప్రమాదానికి గురైందని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని, ఒక పైలెట్ను ప్రాణాలతో కాపాడారని అన్నారు. మరో పైలెట్ జాడ తెలియరావట్లేదని, అతని కోసం విస్తృత గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. నౌకాదళం అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ మిగ్-29కే. ఇలాంటి ఎయిర్ క్రాఫ్టులు మొత్తం 40 వరకు నౌకాదళంలో ఉన్నాయి.
ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి దీన్ని ఆపరేట్ చేస్తారు. అరేబియా సముద్రంలో కొద్దిరోజుల కిందట నిర్వహించిన మలబార్ యుద్ధ విన్యాసాల్లోనూ ఈ మిగ్ పాల్గొంది. ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచే వాటిని ఆపరేట్ చేశారు. గోవాలోని నేవీ బేస్ క్యాంప్ నుంచి మిగ్-29కే రకానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్లను వినియోగిస్తుంటారు. శిక్షణలో భాగంగా గురువారం ఉదయం బేస్ క్యాంప్ నుంచి బయలుదేరి వెళ్లిన ఈ ఎయిర్ క్రాప్ట్ అరేబియా సముద్రంపై ప్రయాణిస్తోన్న సమయంలో ప్రమాదానికి గురైంది. కాగా- రెండో పైలెట్ జీవించి ఉన్నారా? లేదా? అనేది ఇప్పుడే నిర్ధారించలేమని నేవీ అధికారులు చెబుతున్నారు.