పాలకుల అసమర్థతకు సాక్ష్యం వలస భారతం: బహు దూరపు బాటసారుల బతుకు దుర్భరం
వలస వెతలు అన్నీఇన్నీ కావు . కరోనా వలస కార్మికులకు కష్టాలు తెచ్చి పెట్టింది. తమ వారికి దూరంగా బతుకు భారంగా వలస జీవులు పడుతున్న వేదన వర్ణనాతీతంగా మారింది . ప్రభుత్వాలు వలస కార్మికులను ఎవరి రాష్ట్రాలకు వారిని తరలిస్తామని చెప్తున్నా ఆచరణలో మాత్రం అది అమలు కావటం లేదు. దీంతో వలస జీవుల వెతలు కన్నీరు పెట్టిస్తున్నాయి . కరోనా కాలంలో నిజంగా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు , దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరూ అంటే వలస జీవులే అని చెప్పక తప్పని స్థితి . ఇది మన నాగరిక సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది . పాలకుల అసమర్థతకు సాక్ష్యంగా నిలుస్తుంది .
'విడిచిపెడితే నడిచి నేను పోతా సారూ' .. మనసును మెలిపెడుతున్న వలస జీవుల వెతలపై పాట
బహుదూరపు బాటసారులుగా వలస జీవులు
లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అసలు ముగుస్తుందో లేదో కూడా తెలియదు. అయిన వారికి దూరంగా బతుకు భారంగా చేతిలో చిల్లిగవ్వ లేక జీవనం సాగించలేని వలస కార్మికులు బహు దూరపు బాటసారులయ్యారు. వేల కిలోమీటర్లు పిల్లా జెల్లాతో సామాన్ల మూటలతో బయలుదేరారు. రోజంతా అలుపెరుగని నడక సాగిస్తున్నారు . తినటానికి తిండి లేక , మండుటెండలో గొంతు ఎండిపోతున్నా , నాలుక పిడస కడుతున్నా కొడిగట్టే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని తమ వారి కోసం పయనం సాగిస్తున్నారు.
ఎవర్ని కదిలించినా వ్యధా భరిత కథే .. నడవలేక నడుస్తున్న కార్మికులు
కాళ్ళు పుండ్లు పడినా, నడవలేని స్థితిలో సైతం నడక సాగిస్తున్నారు వలస కార్మికులు. ప్రభుత్వాలు మాత్రం వారికి అన్నీ సదుపాయాలూ కల్పిస్తున్నామని, భోజనం అందిస్తున్నామని చెప్పి, వారిని పంపించటానికి ప్రయత్నం చేస్తున్నామని చేతులు దులుపుకుంటున్నాయి. అవన్నీ మాటల్లోనే .. కానీ వాస్తవం నడిరోడ్డు మీద నడుస్తుంది . ప్రతి నిత్యం లక్షల్లో వలస కార్మికులు సాగిస్తున్న ప్రయాణం నిజంగా బాధాకరం . వారిని కదిలిస్తే చాలు వారి కష్టాలు చెప్పి కన్నీటి పర్యంతం అవుతున్నారు . కొందరు వడ దెబ్బకు , కొందరు అనారోగ్యంతో దారిలోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొందరు ఆకలితో బాధ పడలేక ఉసురు తీసుకుంటున్నారు.
పిల్లలతో మండుటెండలో కష్టాలు
చంటి పిల్లలను చంకనెత్తుకుని వారు నడుస్తున్న తీరు అత్యంత బాధాకరం , ఆధునిక సాంకేతిక యుగంలో ఇంకా ఇలాంటి కష్టాలు చూడాల్సి వస్తుంది అంటే అది మన సమాజానికే సిగ్గు చేటు . ప్రభుత్వాలకు మాత్రం ఇది నిజమైన ఫెయిల్యూర్ . మనసును కదిలించి వేస్తున్న వలస కార్మికుల నడక కష్టాలెన్నో . సూట్ కేస్ మీద నిద్ర పోతున్న పిల్లాడితో ఒక తల్లి తన ఇంటికి చేరటానికి సాగిస్తున్న ప్రయాణం చాలా బాధను కలిగిస్తుంది . ఇక ఆమె పంజాబ్ నుండి ఉత్తరప్రదేశ్ ఝాన్సీకి నడుచుకుంటూ వెళ్తుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే . ఇలాంటి ఉదాహరణలు లక్షల్లో చెప్పొచ్చు .
ఆకలి బాధతో అలమటిస్తున్న వలస కార్మికులు
తినటానికి తిండి లేక ఒక్కో వలస కూలీ పట్టెడు మెతుకులు పెట్టే వాళ్ళ కోసం చూస్తున్నారు. ఇక ఎవరైనా ఏమైనా పెడుతున్నారు అంటే ఆ ఆహారం కోసం చేతులు చాస్తున్న తీరు నిజంగా హృదయ విదారకం . కేవలం ఒక్క అరటి పండు కోసం కార్మికులు చేతులు చాచిన తీరు మన సమాజాన్ని ఇదేనా ఇంతకాలం సాధించిన విజయం అని ప్రశ్నిస్తుంది .ఇన్ని కష్టాలు పడి నడిచి వెళ్తున్న వలస కూలీలను చెక్ పోస్ట్ ల దగ్గర పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక రోడ్ల మీద ఎక్కడపడితే అక్కడే ఆగి దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరు అవుతున్నారు.
పాలకుల అసమర్ధతకు సాక్ష్యంగా నిలుస్తున్న వలస భారతం
ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది బ్రతుకు నెలల కాలంగా రోడ్ల మీద నడకతోనే కొనసాగుతుంది . ఇంతా చూస్తున్న ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొంటాయి అని భావిస్తే మాటలకే పరిమితం అయ్యాయి. ఫలితంగా వలస భారతం మన పాలకుల అసమర్ధతకు సాక్ష్యంగా నిలుస్తుంది . సుఖాన మనలేని వికాసం ఎందుకని ప్రశ్నిస్తుంది. పేదల ఆకలి తీర్చలేని , వారి ఆక్రందనలు వినలేని ప్రభుత్వాలు ఎందుకు అని నిలదీస్తుంది . తప్పని సరి పరిస్థితుల్లో అవసరం అయితే తిరుగుబాటు చేస్తుంది . వేల కిలోమీటర్ల దూరం నడుస్తూ మన దేశ ప్రగతిని వెక్కిరిస్తుంది వలస భారతం.