'విడిచిపెడితే నడిచి నేను పోతా సారూ' .. మనసును మెలిపెడుతున్న వలస జీవుల వెతలపై పాట
కరోనా కాలంలో నిజంగా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు , దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న వాళ్ళు వలస జీవులే. వలస జీవుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు . అయిన వారికి దూరంగా , తినటానికి తిండి, తల దాచుకోవటానికి నీడ లేని పరిస్థితిలో ఏం చెయ్యాలో పాలుపోక కుటుంబాలకు దూరంగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రభుత్వాలు మాత్రం వారికి అన్నీ సదుపాయాలూ కల్పిస్తున్నామని, భోజనం అందిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకుంటుంది. కానీ తమ వారికి దూరంగా వలస కార్మికులు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. కష్టకాలంలో అయిన వారి అండ కోసం విలవిలలాడుతున్నారు.
వికలాంగ బిచ్చగత్తె ఔదార్యం..కరోనా సమయంలో లాక్ డౌన్ సిబ్బందికి అరటిపండ్లు , మజ్జిగ పంపిణీ
ఇంటికి వెళ్ళాలనే వలస జీవుల ఆకాంక్ష తీర్చేదెవరు ? వారి వేదన పాటగా
క్షేత్ర స్థాయిలో వలస జీవులకు సాయం అందుతుందా ? మొత్తం దేశం వ్యాప్తంగా ఎంత మంది వలస జీవులు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు ? వారి పరిస్థితి ఏంటి ? వారు ఏం కోరుకుంటున్నారు ? వంటి అంశాలపై ప్రస్తుతం ప్రభుత్వాలకు ఎలాంటి పట్టింపు లేదు. అయినా సరే తమకు సాయం అందటం లేదని ప్రభుత్వాలను నిందించక వేల కిలోమీటర్లు అయినా నడిచి ఇంటికి చేరుకోవాలనే వారి ఆకాంక్ష వెలిబుచ్చుతున్నారు. దీని వెనుక వారికి బలమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలేంటో చెప్తూ ఒక అద్భుతమైన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గొప్ప దేశంలో చిన్న బతుకులపై ఎవరికి దయలేదా ?
వలస జీవులు తమ కుటుంబాలను తలుచుకుని తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. పిల్లా జెల్లా ఇంటికాడ ఎట్లా ఉండ్రో.. నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో అంటూ సాగిన పాటలో తమ ఆవేదన వెళ్లగక్కారు . "పూట పూట చేసుకోని బతికేటోళ్ళం, పూట గడవ ఇంత దూరం వచ్చినోళ్ళం .. దేశామేమో గొప్పదాయే .. మా బతుకులేమో చిన్నవాయే .. మాయదారి రోగమొచ్చి మా బతుకలల్లో మన్ను బోసే ఏమి బతుకు... ఏమి బతుకు.. చెడ్డ బతుకు" అంటూ వారి మనసు ఆక్రోశిస్తుంది . ఇంత గొప్ప దేశంలో వలస జీవుల చిన్న జీవితాలను ప్రస్తుత కష్ట కాలంలో కాపాడే నాధుడే లేడా అన్న భావన ఈ పాట వింటే ప్రతి ఒక్కరికి కలుగుతుంది . భావోద్వేగాన్ని కలిగిస్తుంది .
పేద రోగం కంటే పెద్ద రోగముందా ? అంటూ ప్రశ్న
పేద రోగం కంటే పెద్ద రోగముందా ? అయిన వాళ్ళ కంటే పెద్ద అండ ఉందా ? అంటూ వలస జీవుల మనసు సమాజాన్ని ప్రశ్నిస్తుంది. కష్టకాలం ఇంటి కాడ ఉంటే సారూ కలిసి మెలిసి కలో, గంజో తాగేటోళ్ళం అంటూ తమ కుటుంబాలతో ఉంటే తినటానికి ఉన్నా లేకున్నా ఎలాగోలా జీవనం సాగించే వాళ్ళం అని, కష్ట కాలంలోనే కదా అయిన వాళ్ళ అండ కావాలి అని అనిపించేది అని వలస జీవుల వ్యధ అర్ధం అయ్యేలా చెప్పారు . అంతే కాదు పిల్లలేమో వదలకుండా కళ్ళల్లో తిరుగుతున్నారని , ఇంటిదాని దుఃఖం వదలకుండా తరుముతుందని ఏమి చెయ్యాలో పాలుపోవటం లేదని వారి మానసిక సంఘర్షణ తెలియజేశారు ఈ పాటలో .
బస్సులు, బండ్లు వద్దు .. విడిచిపెడితే నడిచి వెళ్తా అని ప్రాధేయపడుతున్న వలస జీవులు
ఇక అందుకే వారు ప్రభుత్వాలకు తమను తమ వాళ్ళ దగ్గరకు చేర్చమని ప్రాధేయపడుతున్నారు. "బస్సులొద్దు, బండ్లు వద్దు అయ్యా సారూ విడిచిపెడితే నడిచి మేం పోతాం సారూ" అంటూ నడిచి అయినా , నడక ఎంత కష్టం అయినా , ఎన్ని వేల కిలో మీటర్ల దూరం అయినా నడిచి వెళ్తామని చెప్తున్నారు. వాళ్ళు కోరుకుంటుంది విడిచి పెట్టమని మాత్రమే ..వారి దిగులంతా దూరంగా ఉన్న తమ వారు తన కోసం దిగులు పడుతూ ఎట్లా ఉన్నారో అని .. కుటుంబానికి సంబంధించి అనుబంధాలకు సంబంధించి ఒక సున్నితమైన భావన ఇది .
వలస జీవుల వెతలపై ప్రభుత్వాలే మానవత్వంతో స్పందించాలి
ఇక వలస జీవులు బతుకు జీవుడా అంటూ పట్టెడు మెతుకుల కోసం పడిగాపులు కాస్తూనే తమ వారిని కలిసే రోజు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు . హృదయ విదారక పరిస్థితుల నుండి ఎప్పుడు బయటపడతామో తన ఇంటికి ఎప్పుడు చేరతామో అని కుమిలిపోతున్నారు .ప్రభుత్వాలు నెలల తరబడి వారికి భోజన వసతి అందించే బదులు వారిని వారి స్వస్థలాలకు పంపే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే భావన ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో ఇళ్ళలో కుటుంబాలతో ఉంటున్న వారే తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతున్న తరుణంలో తమ వారికి దూరంగా ఉన్న వలస కార్మిక వెతలు , వారి మానసిక కుంగుబాటు అర్ధం చేసుకోవాల్సింది ప్రభుత్వాలే .. ఇకనైనా వలస జీవుల కష్టాలను , వారి వేదనను మనసుతో అర్ధం చేసుకుని మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది .
Recommended Video