ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులకు భారీ ఊరట ...కీలక ప్రకటన చేసిన హోం శాఖ
కరోనా కాలంలో విధించిన లాక్ డౌన్ తో నిజంగా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు , దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న వలస జీవులు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న విద్యార్థులు, యాత్రికులకు ఊరటనిచ్చే న్యూస్ చెప్పింది కేంద్ర హోం శాఖ . అయిన వారికి దూరంగా , తినటానికి తిండి, తల దాచుకోవటానికి నీడ లేని పరిస్థితిలో కుటుంబాలకు దూరంగా కన్నీటి పర్యంతం అయిన వారు ఇక తమ కన్నీళ్లు తుడుచుకుని తమ వారి చెంతకు చేరటానికి సిద్ధమై పోవచ్చు. కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్ తో వలస కార్మికులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
వలస కార్మికులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉపాధి లేకపోవడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి లేక, ఉన్న చోట నానా అవస్థలు పడుతున్న వలస కార్మికులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇక దేశంలోని పలు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు, యాత్రికులు, విద్యార్థులు తమ సొంత ఊర్లకు వెళ్ళటానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . ఇతర ప్రాంతాల్లో చిక్కుకుని నానా అవస్థలు పడుతున్న వారు లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్న నేపధ్యంలో మానసిక క్షోభ అనుభవించారు. ఇక ఎటూ వెళ్ళలేక ఇబ్బంది పడి మనో వేదనకు గురైన వారు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.
గైడ్ లైన్స్ విడుదల చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
వారిని తరలించేందుకు బస్సులను వినియోగించుకోవాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం సూచన చేసింది. ఇక ఆ బస్సులను శానిటైజ్ చేయాలని, బస్సుల్లో కూర్చునే వ్యక్తులు భౌతిక దూరం పాటించాలని కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే తమ స్వస్థలాలకు తరలించే ప్రతీ వ్యక్తికి స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని, కరోనా లక్షణాలు లేని వ్యక్తులనే తరలించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్ చెయ్యాలని ఆదేశించింది .
Recommended Video
లక్షలాది మందికి రిలీఫ్ ... రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు
స్వస్థలాలకు వెళ్లిన ప్రతీ ఒక్కరూ హోం క్వారంటైన్ పాటించేలా స్థానిక వైద్య అధికారులు బాధ్యత తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం తాజా ప్రకటనతో పలు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న లక్షల మంది వలస కార్మికులకు, యాత్రికులకు, విద్యార్థులకు ఊరట లభించినట్టయింది. ఇంత కాలం వారు అనుభవించిన బాధ నుండి ఉపశమనం దక్కింది . దీంతో లక్షలాదిగా ప్రజలు తమ తమ ప్రాంతాలకు వెళ్ళటానికి ఆయా రాష్ట్రాలు బస్సులు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు వారిని తరలించాలి .