ఆగని మృత్యు ఘోష.. కంటతడి పెట్టించేలా.. మరో వలస కార్మికుడి మృతి..
ఎంత గోస.. ఎంత దు:ఖం.. ఎంత దయనీయం.. వేల కి.మీ కాలినడకన సాగిపోతున్న వలస కూలీ పాదాల రక్తపు మరకలు ఈ దేశ ముఖచిత్రంపై నుంచి ఎన్నటికీ తుడిచేయలేనివి. కరోనా లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఎంతోమంది వలస కూలీలు మృతి చెందారు. ఏ దీమూ,దిక్కూ లేక అయినవాళ్ల వద్దకు,సొంతూళ్లకు పయనమైనవారు మధ్యలోనే ఊపిరి వదులుతున్నారు.
లాక్ డౌన్ దెబ్బకు ఇప్పటివరకూ ప్రాణాలు వదిలిన వలస జీవుల లెక్కలైనా ప్రభుత్వాల వద్ద ఉన్నాయో.. లేవో.. తెలియదు. రోడ్డు ప్రమాదాల్లో కొందరు,డీహైడ్రేషన్తో కొందరు.. ఇలా దేశవ్యాప్తంగా ప్రతీరోజూ ఎక్కడోచోట వలస జీవుల మరణం గురించి వింటూనే ఉన్నాం. తాజాగా మధ్యప్రదేశ్లోని శివ్పురి జిల్లాలో ఓ వలస కార్మికుడు మృత్యువాతపడ్డాడు. మిత్రుడి ఒడిలోనే అతను తుదిశ్వాస విడిచాడు.
గుజరాత్ టు యూపీ..
ఉత్తరప్రదేశ్కి చెందిన అమృత్ రాంచరణ్(24),యాకూబ్ గుజరాత్లోని సూరత్లో ఉన్న ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్తో ఆ ఫ్యాక్టరీ మూతపడింది. దీంతో ఉద్యోగాలు కోల్పోయి.. అక్కడే చిక్కుకుపోయిన స్వస్థలానికి వెళ్లిపోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ వెళ్తున్న ఓ ట్రక్కులో వెళ్లడానికి డ్రైవర్తో మాట్లాడుకున్నారు. అతనికి చెరో రూ.4వేలు చెల్లించారు. ట్రక్కు లోపల స్పేస్ లేని కారణంగా వెనకాలే నిలుచుని ప్రయాణించారు.
మార్గమధ్యలో తీవ్ర అస్వస్థతకు గురై..
ట్రక్కు మధ్యప్రదేశ్లోని శివ్పురి ప్రాంతానికి చేరుకునేసరికి రాంచరణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో జర్నీ కొనసాగించలేకపోయాడు. అసలే కరోనా కాలం కావడంతో ట్రక్కులోని వారు వైరస్ సోకిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అమృత్ ఇక తన వల్ల కాదని చెప్పడంతో అక్కడే దింపేశారు. స్నేహితుడిని ఒంటరిగా వదిలేయలేక యాకూబ్ కూడా అక్కడే దిగిపోయాడు. అప్పటికే అమృత్ వాంతులు కూడా చేసుకుంటున్నాడు. దీంతో యాకూబ్.. రోడ్డుపై వెళ్లేవారిని సాయం చేయాల్సిందిగా బతిమాలాడు.
మృతి చెందిన అమృత్..
యాకూబ్ ఎంతలా ఏడుస్తూ ప్రాధేయపడినా సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కాసేపటికి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు అక్కడికి చేరుకుని అమృత్,యాకూబ్ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అమృత్ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మృతి చెందాడు. అమృత్ తీవ్ర,జ్వరం వాంతులతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చాడని.. అతని శరీరం విపరీతమైన వేడికి గురైందని వైద్యులు తెలిపారు. కోవిడ్-19 టెస్టుల కోసం శాంపిల్స్ పంపించామని.. రిపోర్టులు వస్తే మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.
Recommended Video
క్వారెంటైన్లో యాకూబ్..
యాకూబ్ కూడా ప్రస్తుతం క్వారెంటైన్లోనే ఉన్నాడు. అతని శాంపిల్స్ కూడా కోవిడ్-19 వైద్య పరీక్షల కోసం పంపించారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వలస కూలీల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారంలోనే వేర్వేరు ఘటనల్లో దాదాపు 60 మందికి పైగా వలస కూలీలు మృత్యువాతపడ్డారు. ఔరంగాబాద్లో 17 మంది వలస కూలీలు రైలు చక్రాల చిద్రం కాగా.. ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్లలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 37 మంది మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలు కాకుండా మార్గమధ్యలోనే అస్వస్థతకు గురై మృతి చెందినవారు కూడా చాలామందే ఉన్నారు. మరోవైపు సుప్రీం కోర్టు 'రోడ్డుపై ఎంతమంది వలస కూలీలు వెళ్తున్నారో పర్యవేక్షించడం అసాధ్యం. అయినా నడిచి వెళ్లేవారిని ఎలా ఆపగలం..' అంటూ ప్రశ్నించడం గమనార్హం.