క్వారెంటైన్లో వలస కార్మికుడి ఆత్మహత్య.. సైకిల్ పైనే మహారాష్ట్ర నుంచి యూపీకి..
ఉత్తరప్రదేశ్లో హోమ్ క్వారెంటైన్లో ఉన్న ఓ వలస కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బందా జిల్లాలోని కమాసిన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ముసివాన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏఎస్పీ లాల్ భరత్ కుమార్ పాల్ తెలిపిన వివరాల ప్రకారం.. సునీల్(19) అనే యువకుడు శుక్రవారం తెల్లవారుజామున ముసివాన్ గ్రామంలోని తన ఇంట్లోనే ఓ ఇనుప కడ్డీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బతుకుదెరువు కోసం మహారాష్ట్ర వెళ్లిన అతను ఇటీవలే ముసివాన్కు తిరిగొచ్చాడు. దాదాపు ఏడు రోజులు సైకిల్ పైనే ప్రయాణించి మహారాష్ట్ర నుంచి స్వస్థలానికి చేరుకున్నాడు.గ్రామానికి వచ్చిన తర్వాత హోమ్ క్వారెంటైన్లో ఉన్నాడు.
మరికొద్ది రోజుల్లో క్వారెంటైన్ గడువు కూడా ముగిసిపోనుంది. ఇంతలోనే అనూహ్యంగా అతను ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
సునీల్ మృతిపై అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన అతను మహారాష్ట్ర నుంచి సైకిల్పై వచ్చినట్టు తెలిపారు. అతను గ్రామానికి చేరుకునేసరికీ.. అతని వద్ద ఒక్క రూపాయి కూడా లేదని చెప్పారు. మరోవైపు సునీల్ తండ్రి గుజరాత్లో చిక్కుకుపోయి.. ఇంకా అక్కడే ఉన్నాడని చెప్పారు.