సైకిల్పై ఢిల్లీ టూ బీహార్.. మార్గమధ్యలోనే యువకుడి దుర్మరణం.. ఆగని 'వలస' మరణాలు..
కరోనా లాక్ డౌన్ కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయినది వలస కూలీలే. హఠాత్తుగా దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించడంతో వాళ్లంతా నగరాల్లోనే చిక్కుకుపోయారు. ఉపాధి లేక,చేతిలో డబ్బులు లేక ఏమీ తోచని గందరగోళ పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. కష్టకాలంలో అయినవాళ్లతో ఉండేందుకు స్వస్థలాలకు బయలుదేరారు. రవాణా సౌకర్యాలేవీ లేకపోవడంతో కాలి నడకనే వేల కి.మీ దూరం సాగిపోతున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది వలస కూలీలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇటీవలే 17 మంది వలస కూలీలు ఔరంగాబాద్లో రైలు చక్రాల కింద నలిగి ప్రాణాలు విడిచారు. సైకిల్పై ఢిల్లీ నుంచి బీహార్కు బయలుదేరిన ఓ యువకుడు కూడా దుర్మరణం పాలైన మరో ఘటన తాజాగా లక్నోలో చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో అన్సారీ మృతి
బీహార్కు చెందిన సాఘీర్ అన్సారీ(26) బతుకుదెరువు కోసం ఢిల్లీ వెళ్లాడు. లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన అతను ఇటీవలే సైకిల్పై స్వరాష్ట్రానికి బయలుదేరాడు. అతనితో పాటు మరో ఏడుగురు స్నేహితులు కూడా సైకిళ్ల పైనే బీహార్ బయలుదేరారు.ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో లక్నో హైవేపై ఓ ఎస్యూవీ వెహికల్ అతని సైకిల్ను ఢీకొట్టింది. దీంతో అన్సారీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..
ఎస్యూవీ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని,అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. అతివేగం కారణంగా కారు టైర్ పేలిపోయి అదుపు తప్పిందని చెప్పారు. అన్సారీ ఢిల్లీలో టైలర్గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. మే 5వ తేదీ ఉదయం 10గంటలకు అతను సైకిల్పై బీహార్ బయలుదేరినట్టు గుర్తించారు. అతనికి భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నట్టు చెప్పారు.
మృతదేహాన్ని తరలించేందుకు డబ్బు లేదు..
అన్సారీతో పాటు బయలుదేరిన అతని బంధువు సాహిబ్ అన్సారీ మాట్లాడుతూ.. 'మేము చాలా ఆకలితో ఉన్నాం. కేవలం అటుకులు మాత్రమే తింటూ ప్రయాణిస్తున్నాం. ఎక్కడా తినడానికి ఏమీ దొరకట్లేదు.' అని చెప్పాడు. కారు వేగంగా దూసుకొచ్చి డివైడర్ను ఢీకొట్టి.. పల్టీలు కొడుతూ అన్సారీ సైకిల్ను ఢీకొట్టినట్టు చెప్పాడు. ఇదే క్రమంలో ఓ చెట్టును ఢీకొట్టి ఆగిపోవడంతో తమకు ప్రమాదం తప్పిందన్నాడు.
అన్సారీ మృతదేహానికి పోస్టుమార్టమ్ తర్వాత తమకు అప్పగించినట్టు తెలిపాడు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు తమవద్ద డబ్బు లేకపోవడంతో అందుకు అవసరమైన విరాళాలు సేకరిస్తున్నట్టు తెలిపాడు.
Recommended Video
సాయం చేయడానికి నిరాకరించిన నిందితుడు..
'మేము పేదవాళ్లం. రెక్కాడితేనే తిండి ఉంటుంది. పని లేకపోతే తిండి లేదు.' అని సాహిబ్ అన్సారీ వాపోయాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మృతదేహాన్ని తరలించేందుకు మొదట తమకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పాడని.. కానీ ఆ తర్వాత నిరాకరించాడని తెలిపాడు. అంతేకాదు,మీ ఇష్టమొచ్చింది చేస్కోండి... తానైతే రాలేనని తెగేసి చెప్పాడన్నారు. ఇటీవలే లక్నో నుంచి ఛత్తీస్ఘడ్ బయలుదేరిన భార్యాభర్తలు లక్నో హైవేపై బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇవి మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ప్రతీరోజూ ఎక్కడో చోట వలస కూలీలు రాలిపోతూనే ఉన్నారు. వారి ధీనస్థితి పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.