తిండి లేక రోజుల తరబడి ప్రయాణం: రైల్వేస్టేషన్లో బిస్కెట్ల కోసం వలస కార్మికుల కొట్లాట
పాట్నా: దేశంలో వలస కార్మికుల వెతలు రోజురోజుకు వర్ణనాతీతంగా మారుతున్నాయి. స్వస్థలాలకు చేరుకోవడానికి వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. చిన్నపిల్లలను భుజాల మీద కూర్చోబెట్టుకుని వందలాది కిలోమీటర్ల మేర కాళ్లీడ్చుకుంటూ తిరుగుముఖం పడుతున్నారు. వారి ఇబ్బందులకు సంబంధించిన ఫొటోలు రోజూ సోషల్ మీడియాను వెల్లువలా ముంచెత్తుతున్నాయి. వారి బాధలను కళ్లకు కట్టినట్టు చూపుతున్నాయి.
లాక్డౌన్ వల్ల జీవనోపాధిని కోల్పోయిన వారంతా కాలినడకన స్వస్థలాలకు తిరుగుముఖం పట్టగా.. మరికొందరు శ్రామిక్ ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మార్గమధ్యలో కడుపు నింపుకోవడానికి అగచాట్లు పడుతున్నారు. శ్రామిక్ రైళ్లల్లో కూడా ఈ బాధలు వారికి తప్పట్లేదు. రైల్వే అధికారులు ఎలాంటి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయలేదు. రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్లపైనా ఎలాంటి దుకాణాలు తెరచి ఉంచకపోవడం వల్ల ఆకలికి అలమటిస్తున్నారు.
बिहार के कटिहार स्टेशन पर #20लाख_करोड़ के लिए संघर्ष
— The Protagonist⛺ (@kvivekbr) May 14, 2020
(#बिस्किट)pic.twitter.com/AX1e82UogG
బిహార్లోని కతిహార్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకున్న ఓ ఉదంతం వలస కార్మికుల దుస్థితికి అద్దం పడుతోంది. రైల్వేస్టేషన్ అధికారులు ఓ సంచిలో అందజేసిన కొద్దిపాటి బిస్కెట్లు, ఆహార పాకెట్ల కోసం వలస కార్మికులు ఒకరినొకరు తోసుకున్నారు. తన్నుకున్నారు. గొడవ పడ్డారు. రైలు బయలుదేరినప్పటి నుంచీ తిండి లేకపోవడం వల్ల ఓ బిస్కెట్ పాకెట్ అందినా అదృష్టంగా భావిస్తున్నామని చెబుతున్నారు.
రైల్వే అధికారులు పంపిణీ చేసిన బిస్కెట్లు, ఆహార పాకెట్ల కోసం వలస కార్మికుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఓ చిన్న సంచిలో ఉంచి అందజేసిన బిస్కెట్ పాకెట్ల కోసం వలస కార్మికులు ఎగబడిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వలస కార్మికుల దీనస్థితికి అద్దం పట్టింది. వలస కార్మికులు ఒకరినొకరు తోసుకుంటున్నప్పటికీ.. వారిని విడిపించడానికి ఏ ఒక్క రైల్వే సిబ్బంది కూడా సంఘటనాస్థలంలో కనిపించలేదు.