ఇళ్ళకు పంపాలని తిరుగుబాటు చేస్తున్న వలస కార్మికులు .. సూరత్ లో ఘటన
కరోనా మహమ్మారి నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇక ఈ లాక్ డౌన్ వలస జీవుల పాలిట శాపంగా మారింది. పనుల్లేక , పస్తులు ఉండలేక , కుటుంబాలను వదిలి పెట్టి ఇతర రాష్ట్రాలలో ఉన్న వలస కార్మికులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మా ఇళ్ళకు వెళ్తాం సారూ అని ప్రాధేయ పడుతున్నారు . మమ్మల్ని విడిచి పెట్టండి అని అడుగుతున్నారు.
ఇక లాక్ డౌన్ ప్రభావంతో రాష్ట్రాల సరిహద్దులు కూడా మూసివేశారు. బస్సులు, రైళ్ళు వంటి రవాణా సౌకర్యాలు లేకున్నా ఇంటికి వెళ్ళాలనే వారి తపన కాలినడకన అయినా వెళ్ళాలనే ఆలోచనకు తీసుకొచ్చింది. వేల కిలోమీటర్ల ప్రయాణం అయినా సరే నడిచి వెళ్ళాలని ప్రయత్నం చేసిన వారి ప్రయత్నాలకు అన్ని చోట్లా పోలీసులు అడ్డు పడ్డారు. వారిని క్వారంటైన్ కు తరలించారు. ఇక క్వారంటైన్ లో వారిని భోజన వసతి కల్పించినా సరే వాళ్ళు ఉండలేని పరిస్థితి . ఇక ఈ నేపథ్యంలో అలా కుటుంబాలకు దూరంగా ఉన్న తమను ఇళ్లకు పంపించకుండా బలవంతంగా పనిచేయించుకుంటున్నారని సూరత్లోని వజ్రాల తయారీ పరిశ్రమలో పనిచేసే వలస కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగుబాటు చేశారు.
వందలాది మంది డైమండ్ బీ బౌర్స్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆగ్రహంతో ఉన్న కొందరు ఆ భవన సముదాయంపై రాళ్లు రువ్వారు. తమను స్వస్థలాలకు పంపించాలని వలస కార్మికులు డిమాండ్ చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఒక సూరత్ లోనే కాదు చాలా చోట్ల వలస కార్మికులు తమ వారికి దూరంగా ఉండలేక తీవ్ర మనస్థాపానికి గురై చివరకు దాడులకు పాల్పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చొరవ చూపి వలస కార్మికులను వాళ్ళ వాళ్ళ దగ్గరకు పంపే ఆలోచన చెయ్యాల్సిన అవసరం ఉంది.