వలస కార్మికుల తరలింపుపై కేంద్రం ట్విస్ట్.. తప్పెవరిది..? భారం ఎవరిపై..?
లాక్ డౌన్ తర్వాత దేశంలో ఎక్కువమందిని కదిలించిన దృశ్యాలు వలస కార్మికులవే. శ్రమతో,ఉత్పత్తితో దేశాన్ని నిర్మించే ఆ కార్మికులను అతీ,గతీ లేకుండా వదిలేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు చలించిన ప్రభుత్వం ప్రత్యేక రైళ్ల ద్వారా వారిని స్వస్థలాలకు తరలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ సాధారణ రోజుల్లో మాదిరే ఇప్పుడు కూడా వారి నుంచి టికెట్ రుసుం వసూలు చేయాలని నిర్ణయించడం మరోసారి విమర్శలకు తావిస్తోంది. మానవతా దృక్పథంతో కేంద్రమే ఆ ఖర్చులను భరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే,రాజస్తాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ విజ్ఞప్తి చేసినప్పటికీ.. అటువైపు నుంచి సానుకూల స్పందన లేదు.
Recommended Video
టికెట్ చార్జీల వసూలు
రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ మాట్లాడుతూ.. ' ఇది స్పృహతో తీసుకున్న నిర్ణయమే. టికెట్ రుసుం వసూలు చేయడం ద్వారా స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారు మాత్రమే రైళ్లు ఎక్కుతారు. ఒకవేళ ఉచితంగా పంపిస్తే.. సాధారణ జనం కూడా రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. కానీ ఈ రైళ్లు కేవలం నగరాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు,విద్యార్థుల కోసం మాత్రమే. కాబట్టి నామమాత్రపు ఛార్జీలను వసూలు చేస్తున్నాం.' అని చెప్పారు.
వలస కార్మికులపై కేంద్రం ట్విస్ట్
వలస కార్మికుల తరలింపు విషయంలో కేంద్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా ఆదివారం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో దానికి సంబంధించిన మార్గదర్శకాలను పేర్కొన్నారు. లాక్ డౌన్కి ముందే బయలుదేరి.. ఆ తర్వాత దాని కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం మాత్రమే రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అంతే తప్ప,పని కోసం వచ్చి ఆయా ప్రాంతాల్లో సాధారణంగా జీవిస్తున్నవారికి లేదా సాధారణంగా స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్నవారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది.
చెల్లించిన జార్ఖండ్ ప్రభుత్వం..
రాజస్తాన్లోని కోటలో చిక్కుకుపోయిన తమ విద్యార్థులను ప్రత్యేక రైలు ద్వారా రాష్ట్రానికి తరలించినందుకు గాను జార్ఖండ్ ప్రభుత్వం రైల్వేకి రూ.5.4లక్షలు చెల్లించింది. తెలంగాణలోని లింగంపల్లి నుంచి జార్ఖండ్లోని హతియాకు 1200 మంది వలస కార్మికులను తరలించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను చెల్లించాల్సిన మొత్తం ఇంకా తమకు అందలేదని రైల్వే తెలిపింది.
రైల్వే ఏమంటోంది..
కేంద్ర రైల్వే శాఖ మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వలస కార్మికులకు మాత్రమే శ్రామిక్ రైళ్ల టికెట్లు అందించాలి. అలాగే దానికి తగ్గ చార్జీలు కూడా వారి నుంచి వసూలు చేయాలి. 'ప్రస్తుతం మూడు,నాలుగు రకాల పద్దతులు మేము గమనిస్తున్నాం. చాలా ప్రాంతాల్లో వలస కూలీలకు తమ యజమానులు స్వస్థలాలకు వెళ్లేందుకు డబ్బులు ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్జీవోలు సాయం చేస్తున్నారు. ఎక్కడినుంచైతే రైళ్లలో వలస కార్మికులను పంపిస్తున్నారో.. ఆ రాష్ట్రాలు రైల్వేకు చార్జీలు చెల్లిస్తున్నాయి. ఆ వలస కార్మికులకు చెందిన రాష్ట్రం.. తమవాళ్లు ఎక్కడినుంచి వచ్చారో ఆ రాష్ట్రానికి తిరిగి చెల్లిస్తుంది. ఇప్పుడే ఈ ప్రక్రియ మొదలైంది. కాబట్టి కాస్త కుదురుకోవడానికి సమయం పడుతుంది.' అని రైల్వే బోర్డు తెలిపింది.
ఎంత వసూలు చేస్తున్నారు..
శ్రామిక్ రైళ్లలో మూడు వంతుల కెపాసిటీకి కేవలం రెండు వంతుల ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నామని రైల్వే స్పష్టం చేసింది. 1600 కెపాసిటీ ఉండే రైల్లో కేవలం 1200 మందిని తరలిస్తున్నట్టు చెప్పింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ సర్వీసులను నడుపుతున్నామని.. ప్రయాణికులకు కాంప్లిమెంటరీ ఫుడ్,వాటర్ అందజేస్తున్నామని తెలిపింది. అలాగే శానిటైజర్స్,సబ్బులు అందజేస్తున్నామని తెలిపింది. నాన్-ఏసీ స్లీపర్ క్లాసులో ప్రయాణ దూరాన్ని బట్టి టికెట్ చార్జీని వసూలు చేస్తున్నారు. సూపర్ఫాస్ట్ చార్జీ రూ.30తో పాటు రిజర్వ్ బెర్త్పై రూ.20 వసూలు చేస్తున్నారు. శనివారం(మే 2) గుజరాత్లోని సూరత్ నుంచి ఒడిశాలోని పూరీకి బయలుదేరిన శ్రామిక్ రైల్లో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.710 చార్జీ వసూలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి భోపాల్ వరకు శ్రామిక్ రైల్లో ప్రయాణించినవారికి ఒక్కొక్కరికి రూ.250 చొప్పున చార్జీ వసూలు చేశారు.
తప్పెవరిది.. ఎందుకు చెల్లించాలి..
వలస కార్మికుల నుంచి టికెట్ చార్జీలు వసూలు చేయాలంటూ హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను సీపీఎం తీవ్రంగా ఖండించింది. గత రెండు నెలలుగా ఏవిధమైన ఆదాయం లేని పేద వలస కూలీల నుంచి డబ్బులు వసూలు చేయాలనుకోవడం మోదీ సర్కార్ కౄరత్వానికి నిదర్శనమని విమర్శించింది. కేంద్రం నుంచి ఎలాంటి సాయం లేని కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఖర్చును భరించడం అసాధ్యమని పేర్కొంది. నగరాల్లో చిక్కుకుపోవడం వలస కార్మికులు చేసిన తప్పు కాదని.. మార్చి 23వ తేదీ టీవీ ముందుకొచ్చి నాలుగు గంటల్లో లాక్ డౌన్ ప్రకటిస్తే.. వాళ్లు ఎక్కడికి వెళ్లగలరని ప్రశ్నించింది. కాబట్టి కేంద్రం ముందు చూపులేక పోవడం వల్ల జరిగిన ఈ తప్పిదానికి కేంద్రమే బాధ్యత వహించాలని.. వలస కార్మికుల తరలింపు ఖర్చును భరించాలని సీపీఎం డిమాండ్ చేసింది.