ఘోరం: డ్రైనేజీ, రోడ్లను శుభ్రం చేసే కెమికల్స్తో వలస కార్మికులకు స్నానం..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన స్వస్థలానికి వెళ్లడానికి వచ్చిన కొందరు వలస కార్మికులు, వారి కుటుంబాలకు అత్యంత అమానవీయంగా స్వాగతం పలికారు ఉత్తర ప్రదేశ్ మున్సిపల్ అధికారులు. డ్రైనేజీలు, రోడ్లను శుభ్రం చేయడానికి వినియోగించే డిసిన్ఫెక్టెంట్ కెమికల్స్తో వారికి స్నానం చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ ఘటనపై స్థానిక జిల్లా పాలనా యంత్రాంగం విచారణకు ఆదేశించింది.
ఉత్తర ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో జీవనోపాధిని కోల్పోయిన వందలాది మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరుగుముఖం పట్టిన విషయం తెలిసిందే. దేశ రాజధాని నుంచే కాకుండా.. వేర్వేరు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. తాము పనిచేస్తోన్న సంస్థలు, ఫ్యాక్టరీలో లాక్డౌన్ కావడంతో ఎలాంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో లేనప్పటికీ వారంతా.. మూటా ముల్లె సర్దుకుని స్వస్థలానికి కాలి నడకన చేరుకుంటున్నారు.
అలా బరేలీకి చేరిన కొందరు వలస కార్మికులు, వారి కుటుంబాలను నగర శివార్లలోనే అడ్డుకున్నారు స్థానిక అధికారులు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను క్వారంటైన్లకు తరలించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్దుష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అయినప్పటికీ.. దాన్ని కాదని బరేలీ మున్సిపల్ అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. వలస కార్మికులు, వారి కుటుంబాలను నడిరోడ్డు మీద కూర్చోబెట్టారు. డ్రైనేజీ, రోడ్లను శుభ్రం చేయడానికి వినియోగించే డిసిన్ఫెక్టెంట్ కెమికల్స్తో వారికి స్నానం చేయించారు.
INHUMAN:-Bareilly UP.
— Saurabh shukla (@Saurabh_Unmute) March 30, 2020
UP प्रशासन का अमानवीय चेहरा
बरेली ज़िले में दिल्ली, हरियाणा,नोएडा से आए सैकड़ों मज़दूरों और बच्चों को ज़मीन पर बैठा कर उनके ऊपर Disinfectant का छिड़काव किया गया,जिसके बाद बहुत सारे बच्चों ने अपनी आंखों में जलन की शिकायत की..via @Benarasiyaa pic.twitter.com/Hp1dqoN0x6
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. దీనిపై విచారణకు ఆదేశించింది. ఈ ఘటన చోటు చేసుకోడానికి గల కారణాలపై సమగ్ర నివేదిక అందజేయాలని బరేలీ జిల్లా కలెక్టర్కు సూచనలను జారీ చేసింది. వెంటనే జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. ఇలా అమానవీయంగా ప్రవర్తించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వలస కార్మికుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.