కరోనా కష్టాలు: ఢిల్లీలో భూప్రకంపనలు.. రాజధానిలో 35 కంటెయిన్మెంట్ జోన్లు
అసలే కరోనా వైరస్ విలయానికి ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఢిల్లీలో ఆదివారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. అయితే రిక్టర్ స్కేలుపై దాని తీవ్రంత స్వల్పంగా, 3.5గా నమోదు కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈస్ట్ ఢిల్లీ కేంద్రంగా భూమి కంపించినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు దేశరాజధానిలో కొవిడ్-19 పేషెంట్ల సంఖ్య 1000 దాటింది. ఆదివారం సాయంత్రానికి మొత్తం 1069 మందికి వైరస్ సోకగా, 27 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
వైరస్ వేగంగా ప్రబలుతుండటంతో ఎక్కడికక్కడ కంటెయిన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఇప్పటికే 35 ప్రాంతాలను కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించామని, రాబోయే రెండుమూడు రోజుల్లో వాటి సంఖ్యను పెంచుతామన్నారు. ఇప్పటికే ప్రకటించిన కంటెయిన్మెంట్ జోన్లలో రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా డిక్లెర్ చేసి, భారీ ఎత్తున శానిటేషన్ డ్రైవ్ చేపడతామని సీఎం వివరించారు.
దేశవ్యాప్తంగా ఆదివారం సాయంత్రానికి కొవిడ్-19 కేసుల సంఖ్య 8447గా నమోదైంది. అందులో 764 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మరో 273 మంది ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతున్నవారిలో సుమారు 1700 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రానందున పలు రాష్ట్రాలు లాక్ డౌన్ గడువును ఈనెల 30 వరకు పొడగించాయి. దీనిపై ప్రధాని మోదీ కూడా అధికారిక ప్రకటన చేయనున్నారు.