చంద్రగ్రహణ వేళ..హంపిలో: కర్ణాటక, జార్ఖండ్లల్లో జంట భూకంపాలు: ఏకకాలంలో..ఆందోళనల్లో
న్యూఢిల్లీ: దేశంలో వరుస భూకంపాలు నమోదువుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల కిందట దేవ రాజధాని సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని పలు ప్రాంతాలను వణికించిన భూకంపాలు వరుస కట్టాయి. ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానాలోని గుర్గావ్.. ఆ తరువాత ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నొయిడా, ఘజియాబాద్లల్లో భూకంప తీవత్ర నమోదైంది. తాజాగా జార్ఖండ్, కర్ణాటకల్లో భూకంపాలు సంభవించాయి. ఈ రెండూ ఏకకాలంలో నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Recommended Video
తిరుమలలో ఆధ్యాత్మిక సౌరభం ఆరంభం: శ్రీవారికి జ్యేష్టాభిషేకం: గోవిందుడి నామస్మరణతో
చంద్రగ్రహణ వేళ వరుస భూకంపాలు నమోదు కావడం పట్ల భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. శుక్రవారం ఉదయం 6:55 నిమిషాలకు కర్ణాటకలోని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చారిత్రాత్మక ప్రదేశం హంపిలో భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. అదే సమయంలో జార్ఖండ్లోని జంషెడ్పూర్లో కూడా భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు జాతీయ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది.
దక్షిణాదిన ఉన్న హంపి, ఉత్తరాదిన ఉన్న జంషెడ్పూర్ మధ్య దూరం సుమారు 1900 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఏకకాలంలో భూకంపం సంభవించడం పట్ల భూగర్భ శాస్త్రవేత్తలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. యాదృశ్చికమే అయినప్పటికీ.. ఏకకాలంలో చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. భూకంపం వల్ల ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేకపోవడం ఊపిరి పీల్చుకున్నారు.
కాగా.. ఓ మోస్తరుగా ప్రకంపనలు నమోదు కావడంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. ఇళ్లను వదిలి పెట్టి రోడ్ల మీదికి పరుగులు తీశారు. చాలాసేపు రోడ్ల మీదే గడిపారు. శుక్ర, శనివారాల్లో చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. భారత కాలమాన ప్రకారం చంద్రగ్రహణం జూన్ 5వ తేదీ రాత్రి 11 గంటల 15 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. ఇది మొత్తం మూడు గంటల 19 నిమిషాల పాటు ఉంటుంది. అదే సమయంలో జంట భూకంపాలు సంభవించడం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.