చెన్నైలో భూకంపం... రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదు
చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధానిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం బంగాళాఖాతంలో ఈ భూకంపం సంభివించింది. భూకంపం రావడంతో చెన్నై నగరం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తినష్టం కానీ సంభవించలేదు.
ఇదిలా ఉంటే సముద్రానికి 10 కిలోమీటర్ల లోతులో భూంకపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. మంగళవారం తెల్లవారుజామున 1:30 గంటలకు కంపించినట్లు సమాచారం.ఇదిలా ఉంటే సునామీ వచ్చే అవకాశం లేదని భారత మెటియారాలాజికల్ డిపార్ట్మెంట్ పేర్కొంది. గతంలో కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో పలుమార్లు భూమి కంపించింది.
ఇక భూమి కంపించడంతో చెన్నై నగరవాసులు ఆ వార్త తెలిపేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించారు. టైడల్ పార్క్ దగ్గర భూమి కంపించడంతో పరుగులు తీశామని కొందరు ట్విటర్లో పోస్టు చేశారు. 2004లో వచ్చిన సునామీని తలపించిందని ఒకరు పోస్టు చేయగా మరొకరు 2002లో గుజరాత్లోని బుజ్లో సంభవించిన భారీ భూకంపం తలపించిందని మరొకరు ట్వీట్ చేశారు.