మీ నాన్న బతికి ఉంటే సంతోషపడేవారు: కాంగ్రెస్ నేతకు ప్రధాని మోడీ ప్రశంస
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అసలేం జరిగిందంటే.. హూస్టన్లో జరిగిన హోడీ మోడీ కార్యక్రమంలో మోడీ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ మిలింద్ దేవరా ఓ ట్వీట్ చేశారు. దీనికి బదులు మోడీ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, ఈ పరిణామం పట్ల కాంగ్రెస్ పార్టీ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
గర్వంగా ఉదంటూ మిలింద్..
హూస్టన్లో ప్రధాని మోడీ చేసిన ప్రసంగం భారత దౌత్యానికి నిదర్శనం. భారత్-అమెరికా బంధాన్ని నెలకొల్పిన తొలితరం నాయకుల్లో మా త్రండి మురళీ దేవరా ఒకరు. అమెరికా అభివృద్ధిలో ఇండో అమెరికన్లు చేస్తున్న కృషిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్తించడం గర్వంగా ఉంది' అని మోడీ ప్రసంగం అనంతరం మిలింద్ దేవరా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ధన్యవాదాలంటూ ప్రధాని..
మిలింద్ దేవరా ట్వీట్పై ప్రధాని మోడీ కూడా స్పందించారు. ‘థాంక్యూ మిలింద్ దేవరా.. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేసిన వారిలో మీ నాన్న, నా స్నేహితుడు మురళీ దేవరాను ఉన్నారు. ఈ అంశాన్ని గుర్తు చేయడం సంతోషకరమైన విషయం. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలను మురళీ దేవరా చూసుకుంటే చాలా సంతోషించేవారు. అమెరికా అధ్యక్షుడు స్వాగతం పలికిన తీరు అద్భుతం' అని మోడీ వ్యాఖ్యానించారు.
మోడీ, ట్రంప్ ప్రసంగాలకు ప్రశంసలు..
హూస్టన్లో ఆదివారం నిర్వహించి హోడీ మోడీ కార్యక్రమానికి 50వేలకు పైగా భారతీయ అమెరికన్లు హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ప్రసంగాలతో అందర్నీ ఆకట్టుకున్నారు. భారత్, భారతీయులపై ట్రంప్ ప్రశంసలు చేయగా.. ట్రంప్ పాలనకు మద్దతు పలుకుతూ అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ మోడీ పిలుపునిచ్చారు. వీరి ప్రసంగాలపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
మిలింద్ దేవరా ఇదే తొలిసారి కాదు..
ఈ నేపథ్యంలోనే మిలింద్ దేవరా కూడా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. అయితే, మిలింద్ ప్రధాని మోడీని పొగడటం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. కాగా, మిలింద్ దేవరా 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఐతే సెప్టెంబర్ మొదటివారంలో ఆ పదవికి రాజీనామా చేశారు. కాగా, మిలింద్ ప్రధానిని ప్రశంసించడంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. మీరు నిజాయితీగల రాజకీయ నాయకులంటూ ప్రశంసించారు.
కాంగ్రెస్ అసంతృప్తి..
ఇది ఇలా ఉండగా, మిలింద్ దేవరా ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించడంపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎన్నికల ప్రచారం నిర్వహించారంటూ.. ఓ వైపు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే.. మరో ఇలా సొంత పార్టీ నేత.. ప్రధానిపై ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీపై ప్రశంసలు చేయడం అవసరమా? అని పలువురు కాంగ్రెస్ నేతలు మిలింద్పై మండిపడుతున్నారు.