శ్రీనగర్ ఆసుపత్రి వద్ద ఉగ్రదాడి, ఒక జవాన్ మృతి, పాక్ ఖైదీ పరారీ
Recommended Video
జమ్మూకశ్మీర్: పాకిస్తాన్ ఉగ్రవాదులు పేట్రెగిపోయారు. మంగళవారం శ్రీనగర్లోని శ్రీ మహారాజా హరిసింగ్ ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డారు. ఆస్పత్రి ఆవరణలోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
పాకిస్తాన్కు చెందిన ఖైదీ అబు హంజుల్లా అలియాస్ నవీద్ను చికిత్స నిమిత్తం భద్రతా బలగాలు ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో ఈ దాడి జరిగింది. ముందుగానే ఆసుపత్రి సమీపంలో మాటు వేసిన ఉగ్రవాదులు.. పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు.
ఈ క్రమంలో ఖైదీ నవీద్ భద్రతా బలగాల చెర నుంచి తప్పించుకున్నాడు. అనంతరం కూడా ఉగ్రవాదులు కూడా పారిపోయారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
మరోవైపు పారిపోయిన ఉగ్రవాదులు, ఖైదీ నవీద్ కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్మూ సెంట్రల్ జైలు నుంచి ఆరుగురు ఖైదీలను చికిత్స నిమిత్తం శ్రీనగర్లోని శ్రీమహారాజా హరిసింగ్ ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు శ్రీనగర్ ఎస్ఎస్పీ ఇంతియాజ్ ఇస్మాయిల్ పేర్కొన్నారు.
ఆసుపత్రి వద్దకు రాగానే ఖైదీల వెంబడి వచ్చిన ఎస్కార్ట్ పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ఆరుగురిలో ఒక పాక్ ఖైదీ నవీద్.. ఎస్కార్ట్ పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను అపహరించి పరారయ్యాడని, ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక పోలీసు మరణించగా, మరొక పోలీసు గాయపడ్డారని ఆయన చెప్పారు.