రష్యాకు భారత్ వార్నింగ్: పాక్ తో సైనిక విన్యాసాలా ?
మాస్కో: పాక్ తో కలిసి సైనిక విన్యాసాలు చెయ్యడం సరికాదని, ఇది పద్దతిగా లేదని రష్యాను భారత్ గట్టిగా హెచ్చరించింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా భావించి మద్దతు ఇచ్చి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని భారత్ గట్టిగా రష్యాకు చెప్పింది.
ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ తో కలిసిమెలసి తిరగడం మంచిది కాదని భారత్ స్పష్టం చేసింది. వార్షిక ద్వైపాక్షిక సదస్సుకు ముందు భారత రాయబారి పంకజ్ శరణ్ మాస్కోలో రష్యా వార్త సంస్థ రియా నొవోఫ్టీకి ఇచ్చిన ఇంటర్వూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈనెల 14వ తేది గోవాకు రానున్నారు. 16వ తేది బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ద్వైపాక్షిక సదస్సు జరగనుంది.
పాకిస్థాన్ తో కలిసి రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభించడంపై భారతదేశం తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించింది. తాము ఆసియాలోని ఇతర దేశాలతో కలిసి సైనిక విన్యాసాలు చేస్తున్నామంటూ రష్యా సమాధానం ఇచ్చింది.
మనమాటలను రష్యా పెద్దగా పట్టించుకోవడం లేదు. బ్రిక్స్ సమావేశాల్లో తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయని పంకజ్ శరణ్ చెప్పారు. బ్రిక్స్ గ్రూప్ లోని అన్ని దేశాలు ఉగ్రవాదం బారిన పడినవే అన్నారు.
అందువల్ల బ్రిక్స్ సమావేశాల్లో ఉగ్రవాదంపై గట్టిగా చర్చ జరుగుతుందని చెప్పారు. భారత్, రష్యా దేశాల మధ్య చాల కాలంగా ప్రత్యేకమైన ప్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, అందులో ఎలాంటి మార్పు లేదని పంకజ్ శరణ్ స్పష్టం చేశారు.
భారత్ కూడా రష్యాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తుంటుందని, అందులో ఎలాంటి మార్పు ఉండదని పంకజ్ శరణ్ చెప్పారు. ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు కలిసి గట్టిగా కృషి చేస్తున్నాయని పంకజ్ శరణ్ వివరించారు.