సభలో దాడి: సంతాప తీర్మానం వ్యతిరేకించాడని మజ్లిస్ నేతను చితకబాదిన బీజేపీ సభ్యులు
ఔరంగాబాద్ : మాజీ ప్రధాని వాజ్పేయి మృతికి సంతాపం తెలుపేందుకు ఔరంగాబాద్ కార్పోరేటర్లు సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశం కాస్త కుస్తీలకు దారితీసింది. ఈ సమావేశంలో వాజ్పేయి మృతికి సంతాపం తెలుపుతూ ప్రతిపాదించారు. అయితే ఎంఐఎం కార్పోరేటర్ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ కార్పోరేటర్లు మజ్లిస్ కార్పోరేటర్పై దాడి చేశారు.
కార్పోరేటర్లు వాజ్పేయికి సంతాపం ప్రకటించాలని అందరూ సమావేశమయ్యారు. బీజేపీ కార్పొరేటర్ రాజు వైద్య సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన మజ్లిస్ కార్పోరేటర్ సయ్యద్ మతీన్ విబేధించాడు. ఇక్కడే అసలు గొడవ ప్రారంభమైంది. మతీన్ విబేధించడంతో బీజేపీ కార్పొరేటర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మతీన్పైకి దూసుకెళ్లి ఒక్కసారిగా దాడి చేశారు.
సయ్యద్ మతీన్ పై బీజేపీ కార్పొరేటర్ల దాడి చేసినప్పటి దృశ్యాలను వీడియోలో రికార్డ్ అయ్యాయి. అందులో మతీన్పై బీజేపీ కార్పొరేటర్లు పిడిగుద్దుల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. దాడి జరుగుతున్న సమయంలో మార్షల్స్ రంగప్రవేశం చేసి మతీన్ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
సయ్యద్ మతీన్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమావేశంలో మతీన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అంతరాయాన్ని కలిగించాడని బీజేపీ కార్పోరేటర్ ఒకరు తెలిపారు. ఇంతకుముందు సభలో జాతీయగీతం పాడటాన్ని మజ్లిస్ వ్యతిరేకించిందని బీజేపీ కార్పోరేటర్ గుర్తుచేశారు. ఇదిలా ఉంటే మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులు అర్పించడాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే వ్యతిరేకించానని.. అంతలోనే బీజేపీ కార్పోరేటర్లు దాడికి దిగారని చెప్పారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మజ్లిస్ మద్దతుదారులు స్థానిక బీజేపీ కార్యకర్తకు సంబంధించిన కారుపై దాడి చేసి అందులోని డ్రైవర్ను చితకబాదారు.సయ్యద్ మతీన్ పాల్పడిన ఈ చర్యకు అతనిపై వేటు వేయాలని బీజేపీ కార్పొరేటర్ ప్రమోద్ రాథోడ్ డిమాండ్ చేశారు.