బీజేపీ తర్వాత రెండోస్థానం: ఔరంగాబాద్లో కాంగ్రెస్, ఎన్సీపీలకు మజ్లిస్ షాక్
ఔరంగాబాద్: హైదరాబాద్ బేస్డ్ మజ్లిస్ పార్టీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటింది. కొద్ది రోజుల క్రితం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ రెండు అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది.
తాజాగా, ఔరంగబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు షాకిచ్చింది. మొత్తం 113 వార్డుల్లో ఇటీవల ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఇందులో మజ్లిస్ పార్టీ అభ్యర్థులు 25 వార్డుల్లో గెలుపొందారు.
అత్యధిక వార్డుల్లో గెలుచుకున్న పార్టీల్లో మజ్లిస్ పార్టీ రెండో స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. శివసేన - భారతీయ జనతా పార్టీల కూటమి 51 స్థానాలు, మజ్లిస్ 25 స్థానాలు, కాంగ్రెస్ 10 స్థానాలు, ఎన్సీపీ 3 వార్డులు గెలుచుకుంది. ఇతరులకు 19 వార్డులు దక్కాయి.
అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న శివసేన - బీజేపీ కూటమి, నగర పాలక సంస్థ చైర్ను దక్కించుకునేందుకు కొన్ని స్థానాలు తక్కువ పడ్డాయి. ఇతరులు 19 స్థానాల్లో గెలిచినందున వారిలో కొందరు మద్దతిస్తే ఆ కూటమి చైర్ను దక్కించుకోవచ్చు. అయితే, ప్రధానంగా కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు షాకిస్తూ మజ్లిస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థాయికి రావడం గమనార్హం.