గాలి కేసు, ఆ జడ్జిని మార్చండి: సుప్రీం, హై కోర్టులకు లేఖ
బెంగళూరు: అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై నమోదు అయిన కేసుల విచారణను కర్ణాటక హై కోర్టు న్యాయమూర్తి అనంద బైరారెడ్డితో విచారణ చేయించరాదని, ఆయన నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ కు విచారణ చెయ్యడానికి అవకాశం ఇవ్వరాదని సుప్రీం కోర్టు, హై కోర్టులకు ఆర్ టీఐ కార్యకర్త ఎస్ఆర్. హీరేమఠ్ మనవి చేశారు.
ఆర్ టీఐ కార్యకర్త ఎస్.ఆర్. హీరోమఠ్ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ఈ విషయంపై సుప్రీం కోర్టు, కర్ణాటక హై కోర్టు ప్రధాన న్యాయమూర్తులకు లేఖ రాశానని చెప్పారు. డిసెంబర్ 13వ తేది (మంగళవారం) కర్ణాటక హై కోర్టులో గాలి జనార్దన్ రెడ్డి మీద నమోదు అయిన అక్రమ మైనింగ్ కేసు విచారణ జరగనుందని అన్నారు.
కేసు విచారణను న్యాయమూర్తి ఆనంద బైరారెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ విచారణ చేపట్టనుందని చెప్పారు. ఇంతకు ముందు లోకాయుక్త దర్యాప్తు చేసి సమర్పించిన నివేదికను పూర్తిగా పరిశీలించకుండా ఆయన తీర్పు చెప్పారని అన్నారు.
అందు వలన ఈ కేసు విచారణ చెయ్యడానికి ఆ న్యాయమూర్తికి అవకాశం ఇవ్వకూడదని అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసు న్యాయమూర్తి ఆనంద బైరారెడ్డి విచారణ చెయ్యకుండా చూడాలని సుప్రీం, హైకోర్టులకు మనవి చేశామని హీరేమఠ్ చెప్పారు.
ప్రజలకు న్యాయస్థానం అంటే ఎంతో గౌరవం ఉందని, అయితే కొన్ని కేసుల తీర్పులు చూసిన ప్రజలు ఆందోళన చెందుతున్నారని హీరేమఠ్ ఆరోపించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గాలి జనార్దన్ రెడ్డి కేసు విచారణ మరొక బెంచ్ కు బదిలి చెయ్యాలని హీరేమఠ్ మనవి చేశారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, కర్ణాటక ఇందన శాఖా మంత్రి డీకే. శివకుమార్, మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్య నాయుడు (బీజేపీ), ఆయన కుమారుడు కట్టా జగదీష్ తదితరులు నిర్దోషులు అని న్యాయమూర్తి ఆనంద బైరారెడ్డి తీర్పు చెప్పారని, ఇలాగే గాలి కూడా కేసు నుంచి తప్పించుకునే అవకాశం ఉందని హీరేమఠ్ ఆరోపించారు.
వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహం చేశారని, జైలుకు వెళ్లి వచ్చిన ఇలాంటి వ్యక్తికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని వెలుగు చూడాలంటే సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి)తో దర్యాప్తు చేయించాలని సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ఎస్ఆర్. హీరే మఠ్ డిమాండ్ చేశారు.