షాక్: తమిళ మంత్రులకు రూ. 400కోట్లు ముట్టజెప్పిన శేఖర్ రెడ్డి!
ఇసుక వ్యాపారి, అక్రమ నగదు చెలామణిలో నిందితుడైన జె శేఖర్రెడ్డికి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగుచూసింది. శేఖర్ రెడ్డి ద్వారా తమిళనాడు మంత్రులకు, అధికారులకు రూ.400 కోట్ల మేరకు ముడుపులు అందాయని
చెన్నై: ఇసుక వ్యాపారి, అక్రమ నగదు చెలామణిలో నిందితుడైన జె శేఖర్రెడ్డికి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగుచూసింది. శేఖర్ రెడ్డి ద్వారా తమిళనాడు మంత్రులకు, అధికారులకు రూ.400 కోట్ల మేరకు ముడుపులు అందాయని ఆదాయపు పన్ను శాఖ అంచనా వేస్తోంది.
తమిళ ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించాలా వద్దా అన్నది తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఏడాది నుంచి..
గత సంవత్సరం డిసెంబరులో శేఖర్రెడ్డి నివాసాలు, కార్యాలయాల నుంచి రూ.142 కోట్ల నగదును ఆదాయపన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. దీనిలో రూ.34 కోట్ల విలువైన కొత్త రూ.2వేల నోట్లూ ఉన్నాయి. అప్పట్నుంచీ ఈ కేసు దర్యాప్తు సాగుతోంది.
అరెస్ట్, ఆస్తుల జప్తు..
ఆ తర్వాత దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. శేఖర్రెడ్డిని అరెస్టు చేసింది. నగదు అక్రమ చెలామణి కేసులో రెండు రోజుల క్రితం శేఖర్రెడ్డికి చెందిన సుమారు రూ.34 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన విషయం తెలిసిందే.
కొనసాగుతున్న అరెస్టులు, దాడులు
వేలకోట్ల అక్రమాస్తులను కూడబెట్టి ఇటీవల ఐటీ అధికారులకు చిక్కిన టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి సాయం చేసిన కోల్కతాకు చెందిన బడా వ్యాపారవేత్త పారస్మాల్ లోధాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు గతంలోనే అరెస్టు చేశారు. ముంబై విమానాశ్రయంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. చెన్నైకి చెందిన శేఖర్రెడ్డి, ఢిల్లీకి చెందిన న్యాయవాది రోహిత్ టండన్కు సంబంధించిన దాదాపు రూ.25కోట్లు పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చేందుకు లోధా సహాయం చేసినట్లు ఈడీ గుర్తించింది. కోల్కతాలోని ప్రముఖ వ్యాపారవేత్తలో లోధా ఒకరు. ఇటీవల జరిగిన ఆయన కుమార్తె వివాహానికి పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ నటులు హాజరయ్యారు. కాగా, ఇటీవల ఢిల్లీలోని న్యాయవాది రోహిత్ టండన్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేసి దాదాపు రూ.13.65కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.2.60కోట్ల కొత్త నోట్లు ఉన్నాయి. టండన్ ఆస్తులు మొత్తం వెయ్యి కోట్ల విలువ పైనే ఉంటాయి.