గాలి భద్ద శత్రువు టపాల్ గణేష్ కు ఆప్ తీర్థం
బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మీద అలుపెరగని పోరాటం చేస్తున్న మైనింగ్ వ్యాపారి టపాల్ గణేష్ త్వరలోనే అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీర్థం పుచ్చుకుంటున్నారు.
ఆప్ లో చేరడానికి టపాల్ గణేష్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. టపాల్ గణేష్ మా పార్టీలో చేరుతున్నారని ఆప్ కర్ణాటక శాఖ సోమవారం దృవీకరించింది. మైనింగ్ వ్యాపారంలో అక్రమాలు చేసి ప్రజలను, ప్రభుత్వాలను మోసం చేశారని ఆరోపిస్తూ గాలి జనార్దన్ రెడ్డి మీద టపాల్ గణేష్ అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేశారు.
గాలి జనార్దన్ రెడ్డి మీద ఎన్నో ఏళ్ల నుంచి అన్ని విధాలుగా టపాల్ గణేష్ పోరాటం చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమంగా మైనింగ్ వ్యాపారం చేశారని ఆరోపిస్తూ ఆయన్ను జైలుకు పంపించిన విషయం తెలిసిందే. గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లడానికి కారణమైన వారిలో టపాల్ గణేష్ ముందు వరసలో ఉన్నారు.
గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లిన తరువాత ఆయన ప్రాణ స్నేహితుడు బి. శ్రీరాములు బళ్లారీ ఎంపీ పదవికి, బీజేపీ సభ్యత్వానికి అప్పట్లో రాజీనామ చేశారు. 2011లో టపాల్ గణేష్ బీజేపీలో చేరారు. రెండు మూడు నెలల పాటు బళ్లారి బీజేపీ కార్యాలయంలో టపాల్ గణేష్ సందడి చేశారు.
తరువాత బీజేపీ నుంచి టపాల్ గణేష్ బయటకు వచ్చేశారు. గాలి సోదరులు ఎక్కడి నుంచి పోటీ చేసినా తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని టపాల్ గణేష్ 2012లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఆప్ లో చేరుతున్న టపాల్ గణేష్ వచ్చే శాసన సభ ఎన్నికల్లో గాలి కుటుంబ సభ్యుల మీద పోటీ చెయ్యడానికి అన్ని సిద్దం చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.