హల్వా ఇచ్చారు.. జయలలితను చంపారు.. మంత్రి షణ్ముగం హాట్ కామెంట్స్
చెన్నై : జయలలిత మరణంతో ట్విస్టుల మీద ట్విస్టులు.. ఆరోపణల మీద ఆరోపణలు తెరపైకి చ్చాయి. అలాంటి నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం తాజాగా మరో బాంబ్ పేల్చారు. హల్వా తినిపించి జయలలితను చంపారంటూ ఆయన చేసిన హాట్ కామెంట్స్ చర్చానీయాంశంగా మారాయి. మంగళవారం రాత్రి నీలమంగలంలో జరిగిన పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అపోలో ఆసుపత్రిలో జయలలితను చూసేందుకు ప్రయత్నించినా కుదరలేదన్నారు. అనంతరం ఆమెను చూసేందుకు శశికళ అనుమతించలేదని ఆరోపించారు.
జయలలిత షుగర్ పేషెంట్ అనీ తెలిసీ కూడా ఆమెకు హల్వా తినిపించారని అన్నారు షణ్ముగం. వ్యాధి ముదిరి చనిపోయారనే సీన్ క్రియేట్ చేయడానికి అలా చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతూ కోలుకుంటున్న వ్యక్తికి కార్డియాక్ అరెస్ట్ ఎలా వస్తుందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఒకవేళ నిజంగానే కార్డియాక్ అరెస్ట్ జరిగితే.. ఆసుపత్రి వరండాలో రక్తం ఎక్కడిదన్నారు. శశికళను తగురీతిలో విచారిస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశముందన్నారు. పనిలోపనిగా టీటీవీ దినకరన్ పై విరుచుకుపడ్డారు షణ్ముగం. రెండాకుల గుర్తును నాశనం చేయాలనుకునే వారి కలలు కల్లలవుతాయని వ్యాఖ్యానించారు.