సీఎం కొడుకుకు ఓటు మాత్రం వెయ్యలేదు, మీ పనులు మాత్రం చెయ్యాలా ? మంత్రి ఫైర్ !
బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఓడిపోవడంతో జేడీఎస్ పార్టీ మంత్రులు, నాయకులు సహనం కొల్పోతున్నారు. కర్ణాటక రోడ్డు రవాణా శాఖ మంత్రి డీసీ. తమ్మణ్ణ ఏకంగా సమస్యలు పరిష్కరించమని మనవి చేసిన ప్రజల మీద మండిపడుతున్నారు.
మండ్య జిల్లా మద్దూరు నియోజక వర్గంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చెయ్యడానికి మంత్రి డీసీ. తమ్మణ్ణ వెళ్లారు. ఆ సందర్బంలో స్థానిక ప్రజలు వారి సమస్యలు చెప్పి పరిష్కరించాలని మంత్రి డీసీ. తమ్మణ్ణకు మనవి చేశారు.
అంతే మంత్రి డీసీ. తమ్మణ్ణకు మండిపోయింది. డ్రైనేజ్ లు, రోడ్ల మరమ్మతులు చెయ్యాలని, ఇక్కడ చాల సమస్యలు ఉన్నాయని స్థానిక ప్రజలు మంత్రి డీసీ. తమ్మణ్ణకు చెప్పారు. సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామికి మాత్రం మీరు ఓటు వెయ్యలేదని, ఇప్పుడు వచ్చి సమస్యలు పరిష్కరించాలని ఎలా చెబుతున్నారని మంత్రి డీసీ తమ్మణ్ణ విరుచుకుపడ్డారు.
అంతటితో శాంతించని మంత్రి డీసీ. తమ్మణ్ణ ఇక్కడికి జోడు ఎద్దులు వస్తాయని, వారికి సమస్యల గురించి చెప్పాలని పరోక్షంగా హీరోలు దర్శన్, యష్ లను విమర్శించారు. మా పార్టీకి ఓటు వెయ్యడానికి నిరకారించిన మీరు ఇప్పుడు సమస్యలు చెప్పడానికి వచ్చినందుకు మీకు సిగ్గుగా లేదా అని మంత్రి డీసీ. తమ్మణ్ణ ఆవేశంతో ఊగిపోయారు.
గతంలో మంత్రి డీసీ. తమ్మణ్ణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వలనే మద్దూరు నియోజక వర్గంలో నిఖిల్ కుమారస్వామికి తక్కువ ఓట్లు పోలైనాయని వెలుగు చూసింది. ఇప్పుడు మరోసారి మంత్రి ప్రజల మీద ఇష్టం వచ్చినట్లు విమర్శలు చెయ్యడంతో జేడీఎస్ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.