‘దేశ ద్రోహులను కాల్చిపారేయండి’: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ నినాదాలు(వీడియో)
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. దేశానికి ద్రోహం చేసేవారిని కాల్చేపారేయండి అంటూ పిలుపునిచ్చారు. సోమవారం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దేశ్ కే గద్దారోంకో.. అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చప్పట్లు కొట్టుకుంటూ నినాదాలు చేయగా.. అక్కడవున్నవారంతా గోలిమారో సాలోంకో అంటూ నినాదాలు చేశారు. దోశ ద్రోహులను కాల్చిపారేయండి అంటూ నినాదాలు చేశారు. రైట్ వింగ్ సంస్థల నేతల నుంచి తరచూ వచ్చే ఈ నినాదాన్ని కేంద్రమంత్రి ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ నేత కపిల్ మిశ్రా కూడా ఇటీవల ఇలాంటి నినాదాలే చేశారు. ఆయన ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే, తాను గానీ, భారతీయ జనతా పార్టీ గానీ ఇలాంటి నినాదాలకు మద్దతు ఇవ్వదని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ చెప్పారు.
Shocking: It was a local BJP leader from Delhi back then, its now a front line BJP leader and MoS Finance, Anurag Thakur who is leading the crowd to chant “Desh ke gaddaron ko, Goli maro salon ko”.
— Prashant Kumar (@scribe_prashant) January 27, 2020
Such is the level of politics, ladies and gentlemen! pic.twitter.com/rXZ8M8m6lz
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నినాదం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, కేంద్రమంత్రి నినాదాలకు అనుకూలంగా, ప్రతికూలంగా సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ ద్రోహులను కాల్చిపారేయాలంటూ నినాదాలు చేయడంలో తప్పేముందని కొందరంటున్నారు. కేంద్రమంత్రి హోదాలో ఇలాంటి నినాదాలు చేయడమేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
కాగా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనేది పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొని అక్కడ బతకలేని స్థితిలో మనదేశానికి శరణార్థులుగా వచ్చిన మైనార్టీల(హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్ట్రియన్లు, ఇతర మైనార్టీలు)కు భారత పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎవరు వ్యతిరేకించినా దేశంలో సీఏఏను అమలు చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు.