'రెచ్చగొట్టలేదు': ముస్లింలపై దాడులు, మంత్రి సంచలనం
న్యూఢిల్లీ: బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి, ఆగ్రా ఎంపీ రామశంకర్ కతిరియా ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ముస్లింలను సైతానులు, రావణ సంతతిగా ఆయన అభివర్ణించారు.
ఇటీవల హత్యకు గురైన వీహెచ్పీ కార్యకర్త అరుణ్ మహౌర్ సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన 'పూజలు ముగించుకుని తిరిగి వస్తున్న అరుణ్ ను హత్య చేశారు. మనం శక్తి పుంజుకోవాల్సిన అవసరం ఉంది. పోరాటం మొదలు పెట్టాలి. పోరాటం ఆరంభించకపోతే ఈరోజు అరుణ్ కోల్పోయాం, తర్వాత మరొకరు బలౌతారు. మరొకర్ని కోల్పోక ముందే మన బలమెంతో చూపాలి. అదిచూసి హంతకులు పారిపోయాలి' అని ఆయన అన్నారు.
I have the CD, such things are untrue. I did not use the word "badla" or "hathiyaar", just offered condolences-MoS HRD Ram Shankar Katheria
— ANI (@ANI_news) March 1, 2016
ఫతేపూర్ సిక్రీ ఎంపీ బాబూలాల్, బీజేపీ స్థానిక నేతలు, ఆగ్రా వీహెచ్పీ నేత అశోక్ లావణ్య కూడా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ముస్లింలపై దాడులు చేయాలని పిలుపునిచ్చినట్టు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు.
ఆ వ్యాఖ్యలు అసత్యమని, తాను ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ముస్లింలపై ప్రతీకారం తీర్చుకోవాలని తాను అనలేదని, నివాళులు మాత్రమే అర్పించానని అన్నారు. "ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన కథనం అవాస్తవం. ఆ కార్యక్రమాన్ని చూసి వార్త రాసుండాల్సింది. నా ప్రసంగం మొత్తం వినకుండానే ఇలాంటి ఆరోపణలు ఎలా రాస్తారు?" అని ఆయన ప్రశ్నించారు.