రాసలీల మంత్రి రమేష్ జార్కిహోళి ఔట్: అమాయకుడిని బలి: మళ్లీ కేబినెట్లోకి: రాజీనామా లేఖలో
బెంగళూరు: కర్ణాటక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, జల వనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ టేపుల వ్యవహారం.. కలకలం రేపుతోంది. కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. మంత్రి పదవి నుంచి ఆయనను తప్పించాలని, కటకటాల వెనక్కి నెట్టాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తోన్నారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ సహా పలువురు సీనియర్ నేతలు అర్ధరాత్రి వరకూ ధర్నాలు చేశారు. ఆందోళనలను నిర్వహించారు.
ఆ వీడియోల్లో ఉన్నది తాను కాదంటూ జార్కిహోళి వివరణ ఇచ్చినప్పటికీ.. వివాదం చల్లారట్లేదు. ఈ పరిణామాల మధ్య రమేష్ జార్కిహోళి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు పంపించారు. సెక్స్ సీడీల వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు సజావుగా సాగాలనే ఉద్దేశంతోనే ఆయన రాజీనామా చేసినట్లు బీజేపీ పార్టీ నాయకులు చెబుతోన్నారు. దర్యాప్తు సందర్భంగా ఈ సెక్స్ స్కాండల్లో తన ప్రమేయం ఏమీ లేదని తేలితే.. తనను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే.. రాజీనామా చేయాలంటూ బీజేపీ అధిష్ఠానం ఆయనను సూచించినట్లు ప్రచారం సాగుతోంది. నాలుగు రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సెక్స్ సీడీల వ్యవహారం బయటికి రావడం వల్ల.. దాని ప్రభావం ఓటుబ్యాంకుపై పడుతుందని కర్ణాటక బీజేపీ నాయకులు అంచనా వేస్తోన్నారు. ఈ అయిదింట్లో మూడు దక్షిణాదిలోనే ఉండటం వల్ల దాని తీవ్రత అధికంగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
పైగా- తమిళనాడు, కేరళ.. కర్ణాటకకు ఆనుకునే ఉండటం వల్ల సెక్స్ సీడీలకు సంబంధించిన దుష్ప్రభావాన్ని నియంత్రించడానికి రాజీనామా చేయక తప్పలేదని అంటున్నారు. ఆయా కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పార్టీ అగ్ర నేతల సూచనలు, హామీల మేరకే జార్కిహోళి తన పదవికి రాజీనామా చేశారని సమాచారం. కేంద్రమంత్రి సురేష్ అంగడి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన బెళగావి లోక్సభతో పాటు మస్కీ, సిందగీ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. రాసలీల సీడీ ఎఫెక్ట్.. ఉప ఎన్నికల పోలింగ్ను కూడా ప్రభావితం చేస్తుందని కర్ణాటక బీజేపీ నాయకులు భావిస్తున్నారు.