'రామ మందిరం ఉంది, పునర్నిర్మాణం జరుగుతుంది'
ఢిల్లీ: అయోధ్యలో రామమందిరం ఉండేదని, ఉంది అని, మరింత పెద్దగా దానిని పునర్ నిర్మాణమూ జరుగుతుందని కేంద్రమంత్రి ధావర్ చంద్ గెహ్లాట్ గురువారం నాడు చెప్పారు. రాజ్యాంగం పట్ల నిబద్ధత అంశంపై లోకసభలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఆయన రామమందిరం అంశాన్ని లేవనెత్తారు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలన్నారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న 370 అధికరణాన్ని రద్దు చేయాలని కోరారు.
రాజ్యాంగ నిబంధనలను కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందన్నారు. ఇందుకు ఆయన షాబానో కేసును ఉదహరించారు. అదే సమయంలో అయోధ్యలో రామ మందిరం అంశాన్ని ప్రస్తావించారు.
పర్సనల్ లా బోర్డులు సమగ్రతకు అవరోధం
రాజ్యాంగం పై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పర్సనల్ లా బోర్డుల పైన వ్యాఖ్యానించారు. పలు మతాలకు చెందిన ఉన్నత సంస్థలతో దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతుందన్నారు. గడిచిన 65 ఏళ్ల కాలంలో ఇది చాలాసార్లు రుజువైందన్నారు.
మత రాజ్యస్థాపన భావనను రాజ్యాంగం నిర్ద్వందంగా తిరస్కరిస్తుందన్నారు. మతం ఆధారిత విభజనను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ ఆంబేడ్కర్ సైతం తిరస్కరించారని గుర్తు చేశారు. ఒక్కో మతం ప్రత్యేకంగా రూపొందించుకున్న చట్టాల వల్ల రాజ్యాంగం అమలుకు ఆటంకాలు ఎదురవుతాయన్నారు.