మెట్రో రైల్లో మొయిలీ ప్రయాణం: సీటును తిరస్కరించారు
న్యూఢిల్లీ: పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ బుధవారం మెట్రో రైలులో తన కార్యాలయానికి వెళ్లారు. ఇంధనాన్ని పొదుపు చేసేందుకు వారంలో ఒకరోజు తాను రైళ్లో వెళ్తానని చెప్పిన మొయిలీ బుధవారం మెట్రోలోనే కార్యాలయానికి వెళ్లారు. ఇక నుండి ప్రతి బుధవారం తాను మెట్రోను ఉపయోగిస్తానని చెప్పారు. రేసు కోర్స్ స్టేషన్లో మెట్రో రైలు ఎక్కిన మొయిలీ పెట్రోలియం భవన్ ఉన్న శాస్త్రి భవన్ (సెక్రటరియేట్ స్టేషన్) వద్ద దిగారు.
మొయిలీ అంతకుముందు ఢిల్లీ 3 తుగ్లక్ రోడ్లోని నివాసం నుంచి రేస్కోర్స్ మెట్రో స్టేషన్కు, సెంట్రల్ సెక్రటరియేట్ స్టేషన్ నుండి కార్యాలయం వరకు కాలి నడకనే వచ్చారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ను ఉపయోగించుకోవడం ద్వారా ఇంధనం పొదుపు చేయాలని మంత్రి ఇటీవలే విజ్ఞప్తి చేశారు.
ఆయన ఇంటి నుంచి రేస్కోర్స్ మెట్రో స్టేషన్కు ఐదు కాలినడకన ఐదు నిముషాలు తీసుకుంటుంది. వారానికి ఓ రోజు ప్రభుత్వం బస్సు లేదా రైళ్లలో ఎందుకు ప్రయాణించాలని చెప్పిందీ మంత్రి మీడియాకు వివరించారు. అంతేకాదు తన మంత్రిత్వశాఖకు చెందిన అధికారులంతా ప్రతి బుధవారం ప్రజారవాణను వినియోగించుకోవాలని మొయిలీ విజ్ఞప్తి చేశారు.
కాగా, మెట్రో రైలు ఎక్కిన మొయిలీకి 73 ఏళ్ల ఓ సీనియర్ సిటిజన్ సీటును ఇవ్వజూపగా మంత్రి సున్నితంగా తిరస్కరించారు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్లడానికి, ఆ తర్వాత తన కార్యాలయానికి రావడానికి మెట్రో రైలులోనే మంత్రి ప్రయాణించారు.