ఆర్ కే నగర్ దెబ్బ: మంత్రి, హీరోలకు సమన్లు: ఒక్క పేపర్లో రూ. 90 కోట్ల లెక్క !
తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్ ఎంజీఆర్ వర్శిటీ ఉపకులపతి గీతా లక్ష్మిలను ఐటీ శాఖ అధికారులు సమన్లు జారీ చేసి సోమవారం విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.
చెన్నై: తమిళనాడులో ఆదాయపన్ను శాఖ దాడుల్లో లభించిన ఆధారాలు, రికార్డులు, పత్రాలు స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ అధికారులు దూకుడు పెంచారు. తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ సమతువ మక్కల్ కట్చి (ఎస్ఎంకే) పార్టీ వ్యవస్థాపకుడు, బహుబాష నటుడు శరత్ కుమార్, ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి గీతా లక్ష్మీలకు ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది.
సోమవారం చెన్నైలోని నుంగంబాక్కంలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో హాజరుకావాలని ఐటీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి విజయభాస్కర్, శరత్ కుమార్ లను విచారించి పూర్తి వివరాలు సేకరించాలని ఐటీ శాఖ అధికారులు నిర్ణయించారు.
మంత్రి ఇంటిలో ఆ ఒక్క పేపర్
తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటిలో భారీ మొత్తంలో నగదు, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అదే సమయంలో ఓ కాగితం ఐటీ శాఖ అధికారులకు చిక్కింది. ఆర్ కే నగర్ లో పార్టీ నేతలు, మంత్రులు ఎవరెవరు ఓటర్లకు ఎన్ని కోట్ల రూపాయలు పంచిపెట్టాలనే పూర్తి వివరాలు అందులో క్షుణ్ణంగా వివరించారని, ఆ ఆధారాలు స్వాధీనం చేసుకున్న తరువాత ఐటీ శాఖ అధికారులు సమన్లు జారీ చేశారని సమాచారం.
హీరోకు తప్పని సినిమా కష్టాలు
ఆర్ కే నగర్ లో శశికళ వర్గం నుంచి పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ కు మద్దతు ప్రకటించిన మరుసటి రోజే ఎస్ఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు శరత్ కుమార్ ఇంటిపై ఐటీ శాఖ దాడులు జరిగాయి. శరత్ కుమార్ ఇంటిలో కొన్ని లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. శరత్ కుమార్ ను విచారించి పూర్తి వివరాలు సేకరించాలని ఐటీ శాఖ అధికారులు నిర్ణయించారని సమాచారం.
గీతాలక్ష్మికి మాజీ సీఎస్ తో లింక్
తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుతో ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి గీతాలక్ష్మి కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కాంట్రాక్టులు కేటాయించే విషయంలో రామ్మోహన్ రావు, గీతాలక్ష్మి అక్రమాలకు పాల్పడ్డారని, విశ్వవిద్యాలయంలో అవినీతి చోటు చేసుకోవడానికి వీరిద్దరూ కారణం అయ్యారని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు.
మిగిలిన మంత్రులను విచారించాలని !
మంత్రి విజయభాస్కర్ ను విచారించిన తరువాత మరికొందరు మంత్రులకు సమన్లు జారీ చేసి విచారించాలని ఐటీ శాఖ అధికారులు నిర్ణయించారని సమాచారం. అదే విధంగా కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలను విచారించి వివరాలు సేకరించాలని ఐటీ శాఖ అధికారులు ఆలోచిస్తున్నారని, వారికి ఎలా సమన్లు జారీ చెయ్యాలని అంటూ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారని తెలిసింది.
ఎడప్పాడికి కొత్త తలనొప్పి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని పన్నీర్ సెల్వం వర్గం, ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఆర్ కే నగర్ ఉప ఎన్నిక రద్దుతో జరుగుతున్న తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.