ఆర్ కే నగర్: ఐటీ దాడుల ఎఫెక్ట్: బెయిల్ కోసం మంత్రులు పరుగో పరుగు!
శశికళ వర్గంలోని 122 మంది ఎమ్మెల్యేలతో కువత్తూరు రిసార్టులో చేసుకున్న అగ్రిమెంట్ల వివరాలు ఐటీ శాఖ అధికారుల చేతికి చిక్కడంతో వారిని విచారించడానికి అధికారులు సిద్దం అయ్యారు.
చెన్నై: ఐటీ అధికారులను బెదిరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మంత్రులకు అరెస్టు చేస్తారేమో అంటూ ముచ్తెమటలు పడుతున్నాయి. మంత్రుల అరెస్టుకు రంగం సిద్దం అయ్యిందని తెలుసుకున్న మంత్రులు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఇక ఐటీ ఉచ్చులో పడ్డ తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ వైపు సీబీఐ దృష్టి సారించినట్లు తాజాగా వెలుగు చూసింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో మొత్తం 32 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ దాడులు జరిగాయి. ఆసమయంలో ఐటీ అధికారులను బెదిరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి.
మెట్లు ఎక్కక తప్పలేదు
ఐటీ శాఖ దాడులకు గురైన ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ కు చివరికి ఐటీ శాఖ కార్యాలయం మెట్లు ఎక్కక తప్పలేదు. ఆయన్ను పదేపదే ఆదాయ పన్ను శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. సోమవారం (ఏప్రిల్ 17) మళ్లీ విచారణకు హాజరుకావాలని ఇటీవలే ఐటీ శాఖ అధికారులు కొత్తగా సమన్లు జారీ చేశారు.
సీబీఐ విచారణకు ఆస్కారం
మంత్రి విజయభాస్కర్ మీద సీబీఐ అధికారులు సైతం దృష్టి సారించారని ప్రచారం జరుగుతోంది. అందుకు నిదర్శనంగా ఇప్పటికే సీబీఐ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. ఇదే సమయంలో మంత్రి విజయభాస్కర్ మీద సీబీఐ విచారణ చేయించాలని ప్రతిపక్షాలు సైతం పట్టుబడుతున్నాయి.
నాన్ బెయిల్ సెక్షన్లు
తమిళనాడు మంత్రులు కామరాజ్, కడంబూరు రాజా, రాధాకృష్ణన్ పై చెన్నైలోని అభిరామపురం పోలీసులు నాన్ బెయిల్ సెక్షన్లతో కూడిన కేసులు నమోదు చేశారు. అరెస్టు తప్పదు అని అనుమానంతో మంత్రులు ముందస్తు బెయిల్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
వదిలే ప్రసక్తే లేదు
ఇప్పటికే మంత్రులు కామరాజ్, కడంబూరు రాజా, రాధాకృష్ణన్ లను విచారించడానికి పోలీసులు సిద్దం అయ్యారు. విచారణ పూర్తి అయిన వెంటనే అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలే అంటున్నాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాలని ముగ్గురు మంత్రుల న్యాయవాదులు సిద్దం అయ్యారు.
శశికళ వర్గం 122 మంది ఎమ్మెల్యేలు
తమిళనాడు సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేసిన తరువాత శశికళ వర్గంలోని 122 మంది ఎమ్మెల్యేలు కువత్తూరు రిసార్టు వేదికగా బంధించారని ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో ఏం జరిగింది అంటూ ఆరా తీయ్యడానికి అధికారులు సిద్దం అయ్యారు.
విజయభాస్కర్ ఇంటిలో రిసార్టు అగ్రిమెంట్లు
మంత్రి విజయభాస్కర్ ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసిన సమయంలో ఎమ్మెల్యేలకు ఆ సమయంలో ఇచ్చిన హామీలు, అప్పగించిన పనులు, కేటాయింపులు తదితర వివరాలకు సంబంధించిన జాబితా సైతం అధికారులకు చిక్కిందని సమాచారం.
ఎమ్మెల్యేలను విచారించాలని
శశికళ వర్గంలోని 122 మంది ఎమ్మెల్యేలు అందరినీ విచారణకు పిలవడం కన్నా సమగ్ర సమాచారంతో అడుగులు వెయ్యడానికి తగ్గ కార్యచరణతో ఐటీ అధికారులు ముందడుగు వేస్తున్నారని సంకేతాలు వెలువడ్డాయి. అయితే అవసరం అయితే 122 మంది ఎమ్మెల్యేలను విచారించడానికి సైతం వెనకడుగు వెయ్యకూడదని ఐటీశాఖ అధికారులు నిర్ణయించారని సమాచారం.