వీకే సింగ్ 'కుక్క వ్యాఖ్యలు': వార్నింగ్ ఇచ్చిన రాజ్నాథ్
న్యూఢిల్లీ: హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో ఓ దళిత కుటుంబంపై అగ్రవర్ణాలు దాడి చేసిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సజీవ దహనమైన విషయంలో కేంద్ర మంత్రి, ఆర్మీ ఛీప్ వీకే సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకటనలు చేసేటప్పుడు కేంద్ర మంత్రులు, నాయకులు మరింత జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాలంటూ హితవు పలికారు. అధికారంలో ఉన్న మంత్రులు తమ ఉద్దేశాలను ప్రజల ముందు సందర్భంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాట్లాడిన తర్వాత మాటలను వక్రీకరించారంటూ తప్పించుకోవడం కుదరదన్నారు.
కేంద్రమంత్రి వీకే సింగ్ ఫరీదాబాద్ ఘటనపై మాట్లాడుతూ ఎవరో కుక్కపై రాయి విసిరితే కేంద్రాన్ని నిందించడం తగదన్నారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా కేంద్రాన్ని నిందించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ ఘటనతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్న వీకే సింగ్ రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
దళిత చిన్నారుల సజీవ దహన ఘటనను ఆయన కుక్కపై దాడితో పోల్చడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వీకే సింగ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో శుక్రవారం నిరసన ఆందోళన చేపట్టింది. ప్రసాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన ఆప్ శ్రేణులు వీకే సింగ్పై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు.
వీకే సింగ్పై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. మరో మంత్రి కిరణ్ రిజుజు ఉత్తర భారతీయులు నిబంధనలను అతిక్రమించడం గర్వంగా భావిస్తారన్న మాజీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తో ఏకీభవిస్తున్నాన్న వ్యాఖ్యలను రాజనాథ్ సింగ్ తప్పుపట్టారు. కిరణ్ రిజీజు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రులు చేసిన వ్యాఖ్యలపై వివరణ తీసుకున్నారు. ఈ రెండు ఘటనలలో మంత్రులు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారంటూ రాజనాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. వీకే సింగ్ వెంటనే రాజీనామా చేయాలని, ఆయనపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మోడీ ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానానికి ఇది అద్దం పడుతోందని కాంగ్రెస్ పార్టీ నేత రందీప్ విమర్శించారు.
హర్యానా ప్రభుత్వం ఈ సంఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, పిల్లలను కోల్పోయి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నచిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించారు. ఇద్దరు చిన్నారులు సజీవ దహనమైన ఘటనకు సంబంధించిన దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. పరిహారం కింద బాధిత కుటుంబానికి పది లక్షల చెక్కును అందజేశారు.