శశికళ పార్టీలోనే ఉండాలి, లేదంటే రాజీనామా చేస్తామని 8 మంది మంత్రులు వార్నింగ్ ?
అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను బహిష్కరిస్తే తాము రాజీనామా చేస్తామని తమిళనాడు మంత్రులు కొందరు శనివారం సీఎం ఎడప్పాడి పళనిసామిని హెచ్చరించారని వెలుగు చూసింది. శశికళను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరిం
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను బహిష్కరిస్తే తాము రాజీనామా చేస్తామని తమిళనాడు మంత్రులు కొందరు శనివారం సీఎం ఎడప్పాడి పళనిసామిని హెచ్చరించారని వెలుగు చూసింది. శశికళను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించరాదని డిమాండ్ చేస్తున్నారని తెలిసింది.
శశికళ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలని కొందరు మంత్రులు ఎడప్పాడి పళనిసామికి సూచించారని సమాచారం. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది శశికళ అనే విషయం గుర్తు పెట్టుకోవాలని దాదాపు 8 మంది మంత్రులు ఎడప్పాడి పళనిసామిని ఎదిరించారని తెలిసింది.
చిన్నమ్మ శశికళ, టీటీవీ దినకరన్ ఇద్దరూ పార్టీకి అవసరం అని మంత్రులు చెప్పడంతో ఎడప్పాడి పళనిసామి షాక్ కు గురైనారని తెలిసింది. టీటీవీ దినకరన్, శశికళ సోదరుడు దివాకరన్ కలిసి మంత్రులకు ఎరవేశారని ఆరోపణలు ఉన్నాయి.
అవసరం అయితే బయట నుంచి డీఎంకే పార్టీకి మద్దతు ఇచ్చి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని గద్దెదింపాలని, పన్నీర్ సెల్వంకు తగిన బుద్ది చెప్పాలని టీటీవీ దినకరన్, దివాకరన్ నిర్ణయించారని తెలిసింది. ఒకవైపు నీట్ పరీక్ష విషయంలో విద్యార్థిని అనిత ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే సీఎం హడలిపోతున్నారు. అదే సమయంలో సొంత పార్టీలోని మంత్రులు ఇప్పుడు సీఎం పళనిసామికి తలనొప్పిగా తయారైనారని సమాచారం.