పాస్ పోర్ట్ రద్దు: ఇక మాల్యా పని అయిపోయినట్టే!
బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని ఎగ్గొట్టిన కేసులో విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విజయ్ మాల్యా పాస్ పోర్టును విదేశీ వ్యవహారాల శాఖ రద్దు చేసింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా తెలియజేసింది.
షోకాజ్ నోటీసుకు విజయ్ మాల్యా ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించామని విదేశాంగ శాఖ కార్యదర్శి వికాశ్ స్వరూప్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈడీ వెల్లడించిన అంశాలు, ముంబై స్పెషల్ జడ్జి పీఎంఎల్ఏ చట్టం, 2002 ప్రకారం జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారంట్లను దృష్టిలో ఉంచుకుని మాల్యా పాస్పోర్టును పాస్పోర్టుల చట్టం, 1967 సెక్షన్ 10(3)(సి), సెక్షన్ 10(3)(హెచ్) ప్రకారం రద్దు చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.
భారత ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో విజయ్ మాల్యా భారత్కు తప్పనిసరిగా తిరిగి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మరోవైపు విజయ్ మాల్యాను భారత్ రప్పించడానికి పాస్ పోర్టు అధికారులతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ బ్యాంకులకు మాల్యా సుమారు 9 వేల కోట్ల రుణం చెల్లించాల్సి ఉంది.
ఇందులో భాగంగా రూ.900 కోట్ల ఐడీబీఐ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న మాల్యా ఉద్దేశ పూర్వకంగా రుణాన్ని ఎగ్గొట్టిన కేసుని ఈడీ విచారణ చేస్తోంది. విజయ్ మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేసి, లుకౌట్ నోటీసులు జారీ చేయడం ద్వారా ఆయన ఇండియాకు తీసుకురావచ్చని, ఆ తర్వాత ముక్కుపిండి బకాయిలు వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా మార్చి నెల 2వ తేదీన భారత్ నుంచి లండన్కు పారిపోయారు. మాల్యా ముంబై కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసింది. మాల్యా కోర్టుకు హాజరుకాకపోవడంతో గత వారం కోర్టు మాల్యాకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది.
After having considered replies by @TheVijayMallya, MEA revokes his passport under S.10(3)(c) & (h) of Passports Act pic.twitter.com/Stb9rX63OV
— Vikas Swarup (@MEAIndia) 24 April 2016